బాబుకు కడప తర్వాతే కుప్పం!: ఎన్ని కుట్రలు చేసినా.. కడపలో జగన్కు ఇలా చెక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత ఇలాకా కడప నుంచే చెక్ చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత ఇలాకా కడప నుంచే చెక్ చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే కడపలో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పలువురిని సైకిల్ ఎక్కించుకుంది.
అలాగే, కడప జిల్లాలో గండికోటకు కృష్ణా జలాలు తీసుకు వచ్చి సొంత ఇలాకాలో చుక్కలు చూపించాలని మొదటి నుంచి టిడిపి భావిస్తోంది. ఈ నీళ్లు తీసుకు వస్తే జగన్కు చిక్కులేనని టిడిపి నేతల ఉద్దేశ్యం.
పులివెందులకు కృష్ణా జలాలు తీసుకు వస్తామని టిడిపి సీనియర్ నేత, ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి గతంలోనే సవాల్ చేశారు. పులివెందులకు కృష్ణా నీరు తీసుకు వచ్చేదాకా తాను గెడ్డం తీయనని సవాల్ చేశారు.
జగన్ ఇలాకాలో చెక్ పెట్టేందుకు..
ఈ నెల 11వ తేదీన కృష్ణా జలాలు పులివెందులను తాకనున్నాయి. దీంతో ఆ రోజున సతీష్ రెడ్డి నెలల పాటుగా పెంచుకుంటున్న గెడ్డాన్నీ తీయానున్నారట. జిల్లాలో గండికోటకు కృష్ణా జలాలు తీసుకు వచ్చి, అక్కడి నుంచి పైడిపాళేనికి నీరివ్వాలనే ఉద్దేశ్యంతో సతీశ్ రెడ్డి సవాల్ చేసి గెడ్డం పెంచుకుంటున్నారు.
పులివెందులకు నీరు
ఈ నెల 11న చంద్రబాబు స్వయంగా పైడిపాళేనికి కృష్ణా జలాలను ఇచ్చేందుకు పంపింగ్ పథకాలను ప్రారంభిస్తారు. గండికోట రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను పైడిపాళంం ప్రాజెక్టుకు తీసుకు వచ్చి, పులివెందుల ప్రాంత రైతులకు ప్రయోజనం చేకూరుస్తామంటున్నారు.
జగన్ కుట్రలు చేసినా..
ఇదే విషయమై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం నాడు మాట్లాడారు. పులివెందులకు నీళ్లు రావడం జగన్కు ఇష్టం లేదని, జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టులు ఆగవని చెప్పారు.
కడప తర్వాతే కుప్పంకు
కడప రైతులకు నీరు ఇచ్చాకే కుప్పం నియోజకవర్గానికి ఇస్తామని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి చెందుతుందని, 2019లో వైసిపికి అభ్యర్థులు దొరకరన్నారు. గండికోట ఎత్తిపోతల పథకం డ్రై ట్రయల్ రన్ను దేవినేని ప్రారంభించారు.