కేసీఆర్, బాబులకు తొలి దెబ్బ!: దేవీప్రసాద్కు అన్యాయమని బీజేపీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అధికార తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు గట్టి షాక్ తగిలింది. తెలంగాణలోని హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల ఓట్ల లెక్కింపు, ఏపీలోని కృష్ణా - గుంటూరు, తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఖమ్మం - నల్గొండ - వరంగల్ జిల్లాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
హైదరాబాద్ పట్టభద్రుల స్థానాన్ని బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి రామచంద్ర రావు గెలుపొందారు. ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ, అధికార తెరాస పార్టీ తరఫున పోటీ చేసిన దేవీప్రసాద్ ఓడిపోయారు. రామచంద్రరావు 53,881 సాధించి టీఆర్ఎస్ అభ్యర్థిపై 13,318 ఓట్ల తేడాతో తొలి ప్రాధాన్య ఓట్లతోనే గెలిచారు.
నల్గొండ - వరంగల్ - ఖమ్మం నియోజకవర్గంలోనూ కారు ఎగుడు దిగుడు దారిలో పడుతూ లేస్తూ కనిపిస్తోంది. పదకొండో రౌండ్ పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి పైన 8,277 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఏపీలో.. గుంటూరు - కృష్ణా ఉపాధ్యాయ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్తి రామకృష్ణ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన గెలుపుపై ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం 13,047 ఓట్లకు గాను ఆయనకు 6,980 ఓట్లు వచ్చాయి. ఆయనకు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. లెఫ్ట్ అభ్యర్థి లక్ష్మణ రావుకు 5వేలకు పైగా ఓట్లు వచ్చాయి. రామకృష్ణ తొలి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చైతన్య రాజు ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి చైతన్య రాజు పైన యూటీఎఫ్ అభ్యర్థి రాముసూర్యారావు రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా గెలుపొందారు.
ఓటమిపై దేవీప్రసాద్
తనను ఓడించడానికి అన్ని పార్టీలు కుమ్మక్కయ్యాయని దేవీ ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందనడానికి ఆ పార్టీకి వచ్చి వెయ్యికంటే తక్కువ ఓట్లే తార్కాణమని చెప్పారు. తన ప్రత్యర్థులు కుమ్మక్కయ్యారని చెప్పాడానికి ఇదే నిదర్శనమన్నారు. తెరాసను ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలు కుయుక్తులు పన్నాయన్నారు. పార్టీ తనను బలిపశువును చేసిందనడం సరి కాదన్నారు.
రామచంద్ర రావు గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి శాసనసభకు పోటీ చేసి ఓడిపోవడం కూడా ఆయన ఓటర్ల వద్దకు వెళ్లేందుకు మంచి అవకాశం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. విజయం సాధించిన రామచంద్రరావుకు దేవీ ప్రసాద్ అభినందనలు తెలిపారు. తనకు ఓటేసిన 40,000 మంది పైగా పట్టభద్రులు, ఉద్యోగులు, కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన ఓటమి తెరాస ప్రభుత్వం ఓటమి కాదన్నారు.
దేవీప్రసాద్కు అన్యాయం జరిగిందన్న రామచంద్ర రావు
దేవీప్రసాద్కు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీగా గెలుపొందిన బీజేపీ నేత రామచంద్ర రావు అన్నారు. తన గెలుపు కేసీఆర్ ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని తెలియజేస్తోందన్నారు. తాను మండలిలో అధికార పార్టీని నిలదీస్తానని చెప్పారు. ఇచ్చిన హామీలు ఏమాత్రం నిలబెట్టుకోవడం లేదన్నారు.
ఓటమిపై చతన్య రాజు
ప్రత్యర్థి పార్టీలు అన్నీ ఒక్కటై తనను ఓడించేందుకు చూసాయని చైతన్య రాజు అన్నారు. నైతికంగా తాను ఓడిపోలేదన్నారు. కాగా, రాముసూర్యా రావు గెలుపొందడంతో యూటీఎఫ్ సంబరాలు చేసుకుంటోంది.