కొడాలికి షాక్: ఉప ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, పోటీ ఇచ్చిన జగన్ పార్టీ, ఘర్షణ
రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లోని పలు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయాలను నమోదు చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పలు ప్రాంతాల్లో గెలుపొంది .
అమరావతి: రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లోని పలు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయాలను నమోదు చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పలు ప్రాంతాల్లో గెలుపొంది పట్టు నిలుపుకుంది. అయితే, కొన్ని వైసీపీకి సిట్టింగ్ స్థానాలుగా ఉన్న వాటిని కూడా టీడీపీ కైవసం చేసుకోవడం గమనార్హం.
వాటిలో కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ 19 వార్డులో టీడీపీ అభ్యర్థి నండూరి వెంకటప్రసాద్ విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఆయన 150 ఓట్ల మెజార్టీ గెలుపొందారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడలో జరిగిన ఉపఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
వైసీపీకి చెందిన వార్డు మెంబర్ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ.. ఇక్కడ గెలిచి ఆ పార్టీకి చెక్ పెట్టాలని టీడీపీ తీవ్ర కసరత్తులే చేశాయి. అయితే, చివరకు టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోగా, టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
ఇక, చిత్తూరు 38 డివిజన్లో టీడీపీ అభ్యర్థి వసంత్కుమార్ వైసీపీ అభ్యర్థిపై 1,508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. యలమంచిలి మున్సిపాలీటీ 16వ వార్డులో టీడీపీ అభ్యర్థి వనం గీతా గ్రేస్ విజయం సాధించారు.
మాచర్ల 15 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి అంకారావు 64 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 16 వార్డులో స్వతంత్ర అభ్యర్థి రవికుమార్ గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో మూడు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
రాజధాని ప్రాంతంలో వైసీపీ
రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మున్సిపాలిటీ ఉప ఎన్నికలో అధికార టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి రాజీనామాతో ఈ మున్సిపాలిటీలోని 31వ వార్డుకు ఉప ఎన్నిక జరిగింది. వ్యక్తిగత కారణాలతో టీడీపీ అభ్యర్థి మురళీకృష్ణ రాజీనామా చేశారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి దర్నాసి రాజారావుపై వైసీపీ అభ్యర్థి మేరుగమల్లి వెంకటరమణ 153 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
టీడీపీ, వైసీపీ ఘర్షణ
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీడీపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఆ ర్యాలీ ఓ థియేటర్ వద్దకు రాగానే వైసీపీ కార్యకర్తలు అక్కడ తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపు చేస్తున్నారు.