ముంచిన టెక్నాలజీ, బాలకృష్ణకి అవమానం ఇలా..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడులో సాంకేతికి పరిజ్ఢానం కొంప ముంచింది. మహానాడుకు వచ్చే ప్రతినిధుల గుర్తింపు కార్డుల కోసం తెచ్చిన టెక్నాలజీ కొంప ముంచింది. ఈ వేడుకకు రావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తెలుగు తమ్ముళ్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు.
వీటిని ప్రధాన ద్వారం వద్ద ఉండే భద్రతా సిబ్బంది తమ సెల్ఫోన్లో అమర్చిన సెన్సర్లతో స్కాన్ చేస్తారు. ఆ సెన్సర్లు గనక గుర్తింపు కార్డు మీద ఉన్న బార్కోడ్ను గుర్తించకపోతే సదరు వ్యక్తిని లోపలికి అనుమతించరు.
అయితే మధ్యలోనే సెన్సర్లు మొరాయించడంతో కార్డులను గుర్తించడం కష్టమైంది. దీంతో వేలాదిమంది బయటే నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన బుధవారం జరిగింది.
బాలకృష్ణకు అవమానం ఇలా..
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మహానాడులో పోలీసుల నుంచి అవమానం ఎదురైన విషయం తెలిసిందే. ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు కూడా. తన సొంతవాహనంలో తెలుగు విజయం ప్రాంగణం వద్దకు చేరుకున్న బాలకృష్ణను పోలీసులు ప్రధాన ద్వారం వద్ద నిలిపివేశారు.
అక్కడే వాహనం దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్లాలని సూచించారు. దీంతో బాలయ్యకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. తాను ఎమ్మెల్యేనని చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. సీఎం వాహనానికి తప్ప మిగతా వాహనాలకు అనుమతి ఇవ్వరాదని తమకు ఆదేశాలు ఉన్నాయని వాటి ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు.
వారు చెప్పినట్టుగా వెళ్లడానికి బాలకృష్ణ నిరాకరించారు. తాను ప్రధాన ద్వారం నుంచే వెళతానని పట్టుపట్టారు. ఒక సమయంలో డ్రైవర్ కారును వెనక్కి తిప్పేయత్నం చేయగా.. అవసరం లేదు ఇటు నుంచే వెళదామని బాలకృష్ణ అతణ్ని వారించారు.
మీకు అదేశాలు ఇచ్చింది ఎవరని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కొంత పరుష పదజాలంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు నచ్చజెప్పి వేరే మార్గంలో ఆయన్ని పంపించేశారు. బాలకృష్ణతో పాటు పలువురికి చేదు అనుభవం ఎదురైంది.