విద్యుత్తు: బాబును టార్గెట్ చేసిన టీ కాంగ్రెస్
హైదరాబాద్: విద్యుత్తు సమస్యపై, శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనల విషయంలో కాంగ్రెసు తెలంగాణ నేతలు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేషరతుగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మద్దతు తెలుపుతూ చంద్రబాబును తప్పు పట్టారు. ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాత్రం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే కెసిఆర్ను కూడా తప్పు పట్టారు.
విద్యుత్పై ఏపీ సీఎం చంద్రబాబుది దొంగ వైఖరి అని షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణపట్నం చంద్రబాబు జాగీరు కాదని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. పంటలు ఎండిపోయాక నిద్రలేచిన కేసీఆర్ ఇప్పుడు పిట్ట కథలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ వస్తే చంద్రబాబు ఇంటి ఎదుట ధర్నాకు తాము సిద్ధమని షబ్బీర్ అలీ చెప్పారు.
చంద్రబాబు మాటల్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలపై కెసిఆర్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. విద్యుత్తు సమస్య తీవ్రమయ్యే వరకు కెసిఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన అడిగారు. కెసిఆర్ది అసమర్థుడి పాలన, కుంభకర్ణుడి నిద్ర అని ఆయన వ్యాఖ్యానించారు.
కెసిఆర్కు అండగా..
ప్రస్తుత తరుణంలో పార్టీలకు అతీతంగా అందరూ కెసిఆర్కు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెసు సరైన పంథాలో వెళ్లడం లేదని ఆయన శనివారంనాడు మీడియాతో అన్నారు. అందుకే తాను కాంగ్రెసు పార్టీ ధర్నాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు టిడిపి తెలంగాణ నేతల బస్సు యాత్రలతో ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తికి అవసరమైన తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
కాంగ్రెసులో విశ్వసనీయత గల నాయకుడు లేడని, సరైన నాయకత్వ కొరత ఉందని ఆయన అన్నారు. అయితే తాను కాంగ్రెసులోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీకి ఓ పద్ధతంటూ లేకుండా పోయిందని ఆయన అన్నారు. విద్యుత్తులో మన వాటా మనకు ఇవ్వాలని చంద్రబాబును అడుగుదామని ఆయన అన్నారు.
చంద్రబాబు ఇంటి వద్ద తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ధర్నా చేయాలని ఆయన అన్నారు. క్లిష్టమైన పరిస్థితిలో ఇవ్వాల్సిన విద్యుత్తు వాటా ఇవ్వకుండా చంద్రబాబు రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తాను కాంగ్రెసును విమర్శించడం లేదని, సలహా ఇస్తున్నానని ఆయన అన్నారు.
తెలంగాణ రైతుల పాలిట చంద్రబాబు శత్రువుగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కరెంట్ కొతలకు కారకుడై రుణమాఫీ నుంచి ఆంధ్ర రైతుల దృష్టి మరలుస్తూ ఆంధ్ర రైతులను కూడా చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం తెలంగాణ నేతలు చంద్రబాబు మాయలో పడవద్దని ఆయన హితవు చెప్పారు. కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు మానేసి చంద్రబాబును నిలదీయాలని ఆయన అన్నారు.