కేసీఆర్ సంచలనం: రాజయ్య బర్తరఫ్, మంత్రిగా కడియం శ్రీహరి ప్రమాణం
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్యను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశారు. ఆయన స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి రాజ్ భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజయ్యను భర్తరప్ చేసే కేసీఆర్ నిర్ణయాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం గవర్నర్తో భేటీ అయ్యారు. అనంతరం కడియంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీ రామారావు, ఈటెల రాజేందర్, జోగు రామన్న, ఎంపీ కే కేశవ రావు తదితరులు హాజరయ్యారు. ఇటీవల సంభవించిన పరిణామాల నేపథ్యంలో రాజయ్యను తొలగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో కడియంను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
మంత్రివర్గంలోను మార్పులు చేర్పులు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని కడియం నిర్వహిస్తారు. అలాగే విద్యాశాఖను అప్పగించారు. ఇన్నాళ్లుగా విద్యాశాఖ నిర్వహించిన జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించారు. రాజయ్య వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను లక్ష్మారెడ్డికి ఇచ్చారు.