ఇప్పటికే జగన్ ఫైర్: పట్టిసీమపై కెసిఆర్ ప్రభుత్వం ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వ్యతిరేకత ఎదరువుతోంది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ ప్రాజెక్టును తప్పు పడుతున్నారు. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే రెండు మూడు సార్లు ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్ వ్యాఖ్యలతో ఆగకుండా పట్టిసీమ ఎత్తపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఎపి పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీటిని మళ్లించేందుకు ఈ పథకాన్ని చేపట్టిందని కేంద్ర జలసంఘానికి, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుకు లేఖలు రాయాలని నిర్ణయించుకుంది.
గోదావరి నుంచి 850 క్యూసెక్కుల నీటి మళ్లింపు సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. దానిద్వారా ప్రకాశం బ్యారేజీకి 80 టిఎంసీల నీటిని మళ్లిస్తారు. గోదావరి నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులతో కూడాిన అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జలసంఘం అనుమతి కూడా తీసుకోవాలి.
అయితే, వాటిని పట్టించుకోకుండా ఎపి ప్రభుత్వం ఏకపక్షంగా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతోందనేది తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తపితోల పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఫిర్యాదు చేసింది.
అయితే, తమ రెండు ప్రాజెక్టులు కొత్తగా చేపట్టినవి కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాటికి అనుమతి లభించిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పునర్విభజన చట్టం ఆమోదానికి ముందే అనుమతి లభించిందనే విషయాన్ని నిరూపించడానికి అవసరమైన ఉత్తర్వులను, ఇతర వివరాలను కేంద్ర జల సంఘానికి అందించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది.