ఎపి విద్యుత్తు ఉద్యోగులకు తెలంగాణ షాక్: వేతనాలివ్వబోమని స్పష్టీకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను వెనక్కి తీసుకోబోమని, వారికి వేతనాలు చెల్లించబోమని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. వారికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అయితే తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల భవితవ్యంపై త్వరలోనే తమ వైఖరిని వెల్లడిస్తామని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
శుక్రవారం నార్త్ బ్లాక్లో హోం శాఖ కార్యదర్శి ఎల్.సీ. గోయల్తో ఏపీ, తెలంగాణ అధికారులు సమావేశమై ఆంధ్ర ఉద్యోగుల తొలగింపుపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ రాజీవ్ శర్మ, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఏపీ తరఫున సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపీజెన్కో సీఎండీ విజయానంద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను తొలిగించిందని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఏపీ అధికారులు వాదించారు. జూన్ 2వ తేదీకి ముందు ఉన్న స్థితిని అలాగే కొనసాగించాలని కోరారు. వారి వాదనను తిరస్కరిస్తూ ఉద్యోగుల తొలగింపు విషయంలో తాము స్థానికతకే కట్టుబడి ఉంటామని తెలంగాణ అధికారుల బృందం స్పష్టం చేసింది.
బదిలీ చేసిన ఉద్యోగులను వెనక్కి తీసుకోలేమని, జీతాలు కూడా చెల్లించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నందున ఏం మాట్లాడినా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని స్పష్టం చేసింది.తమ నిర్ణయం సహేతుకమైనదన్న ఉద్దేశంతోనే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, తుది తీర్పు వచ్చాకే . తగు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ స్పష్టం చేసింది.
ఉద్యోగుల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి ఒక ప్రతినిధి, ఇరు రాష్ట్రాల నుంచి చెరో ప్రతినిధి చొప్పున త్రిసభ్యు కమిటీని వేద్దామంటూ హోంశాఖ కార్యదర్శి చేసిన సూచనతో ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. అయితే తాము ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలంగాణ స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను హోం శాఖ కార్యదర్శికి చెప్పామని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ మీడియాతో చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కోసం త్రిసభ్య కమిటీ వేయాలని హోంశాఖ అధికారులు ప్రతిపాదించారని, కాని ఆ ప్రతిపాదనకు తాము ఒప్పుకోలేదని వెల్లడించారు.