రాజధానిపై పోటీ: బాబు కంటే వేగంగా, కేసీఆర్కు 'ఏపీ' చిక్కుముడి!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలని చూస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సచివాలయాన్ని తరలించాలని చూసే విషయమై విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి, సచివాలయానికి ధీటుగా ఉండాలనే యోచనలో కేసీఆర్లో ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
విభజన నేపథ్యంలో ఏపీలో సింగపూర్, జపాన్ సహకారంతో అత్యాధునిక రాజధానిని నిర్మించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఆ దిశలో ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాదును కూడా ధీటైన రాజధానిగా చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారని అంటున్నారు. ఒకవిధంగా కేసీఆర్ ఏపీతో పోటీ పడుతున్నారంటున్నారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే ఈ వేసవిలోనే సాగర్ను శుద్ధి చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే రాజధాని విషయమై సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కేసీఆర్ కూడా పలు నిర్మాణాల విషయమై లూలు గ్రూప్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఇటీవల కొచ్చిలోని లూలు గ్రూప్కు చెందిన షాపింగ్ మాల్ను సందర్శించారు.
అలాంటి మాల్నే హైదరాబాదులో నిర్మించాలని వారిని కోరారు. గత ఏడాది డిసెంబర్ నెలలో లూలు గ్రూపు ప్రతినిధులు మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. తెలంగాణలో రూ.2500 కోట్ల పెట్టుబడులకు వారు అంగీకారం తెలిపారు. కేసీఆర్ ఇటీవల హైదరాబాదు పరిసరాల్లో పలుమార్లు ఏరియల్ సర్వే చేశారు. అధికారుల నుండి నివేదికలు తెప్పించుకున్నారు.
సచివాలయం తదితరాలు అక్కడే ఉన్న నేపథ్యంలో సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కష్టతరమని కేసీఆర్కు ఫీడ్ బ్యాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయ నిర్మాణానికి ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రిని ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. దీనిపై కేబినెట్ త్వరలో భేటీ అయి, నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీ రాజధాని, సచివాలయం కంటే ముందే తమ సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తహతహలాడుతోందని అంటున్నారు.
'ఏపీ' చిక్కు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందే ఏర్రగడ్డలో సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని అంటున్నారు. అయితే, దానికి కూడా కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ పదేళ్ల వరకు సచివాలయాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ప్రస్తుత సచివాలయాన్ని తొలగించడం కోసం ఏపీని వెకేట్ చేయమని చెప్పలేదు. అయితే, నిర్మాణం జరిగిన తర్వాత తెలంగాణ సచివాలయం వెళ్లడం, ఏపీ సచివాలయం పదేళ్ల పాటు ఇక్కడే ఉంటే కను పాత సచివాలయం వద్ద అప్పుడే మార్పులు, చేర్పులు ఏం జరిగే అవకాశాలు ఉండవంటున్నారు.