పన్ను వసూలు తప్పదు: ఏపీ వెహికిల్స్పై మంత్రి మహేందర్రెడ్డి
హైదరాబాద్: పన్ను వసూలు తప్పనిసరి అని, ప్రయివేటు ట్రావెల్స్ వారు అందుకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి మంగళవారం అన్నారు. పన్ను వసూలు చేయకుంటే తెలంగాణ రాష్ట్రానికి నష్టమన్నారు. ఇప్పటి వరకు అన్ని స్థాయిల్లో చర్చలు జరిగాయని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పన్ను వసూలుపై జీవో విడుదల చేశామన్నారు. కోర్టు నిబంధనలకు లోబడే పన్నులు వసూలు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో రగడ రాజుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చే వాహనాల పైన తెరాస ప్రభుత్వం పన్ను విధించాలని నిర్ణయించింది. మంగళవారం అర్ధరాత్రి నుండి ఇది అమలులోకి రానుంది.
అర్ధరాత్రి నుండి అంతర్రాష్ట్ర పన్నుల విధానం ఏపీకి కూడా వర్తింప చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తీరు పైన ఏపీ ప్రయివేటు బస్సుల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఏపీ ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యం బుధవారం హైకోర్టుకు వెళ్లనుంది. ఏపీ మంత్రి శిద్దా రాఘవ రావు కూడా దీనిపై స్పందించారు.
తెలంగాణకు ఏపీ నుండి వచ్చే వాహనలు...
ఏపీ నుండి తెలంగాణకు వచ్చే వాహనాలు దాదాపు 3,85,836 వరకు ఉంటాయి. అందులో స్టేజ్ క్యారియర్లు 19వేలకు పైగా, మాక్యీ క్యాబ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. లారీలు 3700 వరకు ఉంటాయి.
బస్సుకు ఇప్పటి వరకు లక్షా అయిదు వేల ట్యాక్స్ పడుతోంది. కొత్త పన్నుతో రెండు లక్షల తొంభై ఆరువేల వరకు అవుతుందని అంటున్నారు. ఆరు టైర్ల లారీకి ఇప్పటి వరకు రూ.3500 కాగా, ఇక నుండి రూ.పదివేల వరకు అవుతుందంటున్నారు.