బాబు జాగ్రత్తగా..: పేరు తీసేసి అశోక్కు గంటా షాక్, శిల్పాకు ఏదో ఒకటి
నాలుగు జిల్లాలు మినహా టిడిపి అధ్యక్షులు ఎంపిక దాదాపు ఖరారయింది. అధ్యక్షుల ఎంపిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చాలా సున్నితంగా మారింది. అధినేత దీనిపై తుది కసరత్తు చేస్తున్నారు.
అమరావతి: నాలుగు జిల్లాలు మినహా టిడిపి అధ్యక్షులు ఎంపిక దాదాపు ఖరారయింది. అధ్యక్షుల ఎంపిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చాలా సున్నితంగా మారింది. అధినేత దీనిపై తుది కసరత్తు చేస్తున్నారు.
విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు తప్ప మిగతా చోట్ల అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయినట్టే. జిల్లా అధ్యక్ష పదవికి ఇద్దరు ముగ్గురు పోటీపడుతున్న చోట ఐవీఆర్ఎస్ విధానంలో పార్టీ కేడర్ నుంచి అభిప్రాయసేకరణ జరిపారు.
వచ్చే ఎన్నికలకు వీరు కీలకం కాబట్టి
వచ్చే సాధారణ ఎన్నికలకు జిల్లాల్లో పార్టీకి సారథ్యం వహించేది వీరే. కాబట్టి చంద్రబాబు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి విజయనగరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక సంక్లిష్టంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్నే కొనసాగించాలని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పట్టుబడుతున్నారు. అందరి అభిప్రాయం వ్యక్తిగతంగా తెలుసుకుంటానని ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పడంతో పాటు, జిల్లా నాయకుల నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ జరిపారు.
అశోక్కు షాకిచ్చిన గంటా
ఇది అశోక్ గజపతి రాజు వర్గంలో అసంతృప్తికి కారణమైంది. అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవికి జగదీష్తో పాటు, ఎమ్మెల్యేలు మీసాల గీత, కెఎ నాయుడు తదితరులు పోటీపడ్డారు. ఎంపికపై ఇటీవల ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయసేకరణ జరిపారు. ఈసారి కెఎనాయుడు, ఆయన సోదరుడు కొండబాబు, మహంతి చిన్నంనాయుడిపై అభిప్రాయ సేకరణ జరిపారు. అభిప్రాయసేకరణ చేసినవారి జాబితాలో జగదీష్ పేరు లేకుండా అశోక్ గజపతి రాజుకు షాకిచ్చారు. కానీ అశోక్ అభిప్రాయాన్ని కాదని వేరేవారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చునని అంటున్నారు.
శిల్పాను మండలి చైర్మన్గా పంపిస్తే..
చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పులివర్తి నానిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని శాసనమండలి ఛైర్మన్గా నియమిస్తే, సోమిశెట్టి వెంకటేశ్వర్లుని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించవచ్చునని అంటున్నారు.
ఈ జిల్లాలకు వీరే..
విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావులు పోటీ పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఉన్న రాంబాబు పేరు దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, విజయవాడ అర్బన్, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల అధ్యక్షులుగా ఇప్పుడున్నవారే కొనసాగనున్నారు. గుంటూరు పట్టణ అధ్యక్షుడిని మార్చాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.
జిల్లాల అధ్యక్షులుగా వీరు..
శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా గౌతు శిరీష, విశాఖ అర్బన్ వాసుపల్లి గణేష్, తూర్పు గోదావరి జిల్లా నామన రాంబాబు, పశ్చిమ గోదావరి తోటా సీతారామలక్ష్మి, కృష్ణా బచ్చుల అర్జునుడు, విజయవాడ నగరం బుద్ధా వెంకన్న, గుంటూర జిల్లా జీవీ ఆంజనేయులు, ప్రకాశం దామరచర్ల జనార్ధన్, నెల్లూరు బీదా రవిచంద్ర, చిత్తూరు పులివర్తి నాని, అనంతపురం బికె పార్థసారథి, కడప రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు లేదా శిల్పా చక్రపాణి రెడ్డి, విజయనగరం ద్వారపురెడ్డి జగదీష్ లేదా జేఏ నాయుడు, విశాఖ జిల్లా పంచకర్ల రమేష్ లేదా ముత్తంశెట్టి శ్రీనివాస రావులకు అవకాశముంది.