తెలుగు మీడియం దండగ, ర్యాంకులు రావు: మంత్రి నారాయణ
తెలుగు మీడియం దండగ అని, తెలుగు మీడియంలో చదివితే ర్యాంకులు రావని చెప్పుకొచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. నంద్యాలలోని మున్సిపల్ స్కూలులో తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు : 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని ఆనాడు శ్రీ కృష్ణ దేవరాయలు మన తెలుగు భాష గురించి కీర్తిస్తే... ఈనాడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాత్రం 'తెలుగు మీడియం దండగ' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆయన ఊరుకోలేదు.. తెలుగు మీడియంలో చదివితే ర్యాంకులు రావంటూ చెప్పుకొచ్చారు. అయిదువేల లోపు ర్యాంకు వచ్చే వాళ్లలో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థులు ఉండరంటూ మంత్రి నారాయణ కొత్త భాష్యం చెప్పారు.
ఇంగ్లీష్ మీడియం అయితేనే ర్యాంకులు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తున్నామని ఆయన చెప్పారు.
నంద్యాలలో మున్సిపల్ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా కొన్నాళ్లు పోతే 'ర్యాంకులు రాని విద్యార్థులు కూడా దండగ' అంటారేమో.. ఒకవేళ అలా అంటే.. అప్పుడా విద్యార్థులను ఏం చేయాలి?