ఐఐటి జెఇఇ మెయిన్స్లో తెలుగు పిల్లల తడాఖా
హైదరాబాద్: ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్షల్లో ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం సాయంత్రం సిబిఎస్ఇ జెఇఇ మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 80వేల మంది మెయిన్స్కు హాజరుకాగా, 20 వేలమంది వరకూ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించినట్టు తెలుస్తోంది. అయితే, పూర్తి లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది.
360 మార్కులకు జరిగిన మెయిన్స్ పరీక్షలో టాపర్కు 335 మార్కులు రాగా, అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపికైన చిట్టచివరి అభ్యర్ధికి 105 మార్కులు వచ్చాయి. అంటే 105 మార్కులు దాటివచ్చిన వారంతా అడ్వాన్స్కు ఎంపికయ్యారు. ఈసారి ఓబిసి కటాఫ్ మార్కులు 70కాగా, ఎస్సీ కటాఫ్ మార్కులు 50, ఎస్టీ కటాఫ్ మార్కులు 44గా నిర్ణయించినట్టు సిబిఎస్ఇ చెప్పింది. జెఇఇ మార్కులకు 60శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 40శాతం వెయిటేజీ కలిపి తుది ర్యాంకులను ప్రకటిస్తారు.
ఈసారి జెఇఇ మెయిన్స్కు 13 లక్షలమంది హాజరుకాగా, అందులో కేవలం లక్షన్నర మంది మాత్రమే అడ్వాన్స్కు ఎంపిక చేస్తున్నారు. జనరల్ పిడబ్ల్యుడి కోటా కలిపి 75,750 మంది, ఓబిసి 40,500, ఎస్సీ 22500, ఎస్టీ 11250 మంది ఎంపికయ్యారు. ఇందులో జనరల్ 73,478 మంది మాత్రమే. అన్ని క్యాటగిరిల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 20వేల మందికి పైగానే ఉన్నారు.
అడ్వాన్స్ పరీక్షకు మే 2 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. పరీక్ష మే 24న జరుగుతుంది. జూన్ 18న తుది ఫలితాలు ప్రకటించే వీలుంది. జూన్ 3న ఒఆర్ఆర్ కాపీలను నెట్లో అందుబాటులో ఉంచుతారు. జూన్ 8న తొలి కీ ప్రకటించి, దానిపై 8 నుండి 11 వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల ఆధారంగా 13న తుది కీ ప్రకటిస్తారు. దానికి అనుగుణంగా జూన్ 18న ఫలితాలిస్తారు. జూలై 1న తొలి రౌండ్ సీట్ల పంపిణీ జరుగుతుంది.