లోకేష్కు సాక్షి నిలదీత: జగన్-విజయసాయిలే దిట్ట అని టిడిపి, సవాల్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి తప్పుడు లెక్కలు చూపించడంలో దిట్ట అని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు.
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆస్తుల ప్రకటనపై వైసిపి నేతలు చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు లెక్కలు చూపించడంలో జగన్, విజయసాయిలే ముందుంటారన్నారు. సొంత మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం సరికాదన్నారు. చేతనైతే జగన్ తన ఆస్తుల వివరాలు ప్రకటించాలని సవాల్ చేశారు. లోకేష్ తప్పుడు లెక్కలు చెప్పాలని వైసిపి, సాక్షి నిలదీసిన విషయం తెలిసిందే.
ఏపీ ఉద్యోగాల కేంద్రంగా మారాలి
ఈ-ప్రగతి ప్రాజెక్టులో ఏపీ దూసుకెళ్తొందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేరుగా అన్నారు. విశాఖలోని సీతమ్మధారలో ఎనిమిది విదేశీ ఐటీ కంపెనీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఇప్పుడు ప్రారంభించిన ఐటీ కంపెనీల వల్ల 600 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. విశాఖలో 40 కంపెనీలు వస్తే రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో బ్రాంచ్లు ఏర్పాటు చేసేందుకు పెద్దపెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలు పెద్దయెత్తున రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఏపీ ఎదగాలన్నారు. వినూత్న ఆలోచనలతో మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. విద్యార్థులు తమ ప్రయోగాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు.