బానిసను కాదని బాబుకు వార్నింగ్: 'పవన్ కళ్యాణ్ వేరు, జగన్ వేరు'
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు.. మీ బానిసను కాదంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్పందించారు.
పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యల అనంతరం టిడిపి ఆచితూచి స్పందిస్తోంది. గాలి ముద్దుకృష్ణమ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ వేరు, వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేరు అని చెప్పారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని, రైతులకు మెరుగైన ప్యాకేజీ కూడా ఇవ్వలేదని గాలి ముద్దుకృష్ణమ ఆరోపించారు. రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చిన ఘనత తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబుదే అన్నారు.
రాజధాని భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ తీరు వేరు, జగన్ తీరు వేరని చెప్పారు. రైతులను రెచ్చగొట్టి రాజధానిని అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు.
చర్చల ద్వారా పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ సూచించారని గుర్తు చేశారు. 2019 నాటికి జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. భూములు ఇచ్చేందుకు రైతులు స్వయంగా ముందుకు వచ్చారని చెప్పారు.
చంద్రబాబుతో రతన్ టాటా భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా భటీ అయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో రతన్టాటాకు విజయవాడ ఎంపీ కేశినేని నాని, పలువురు టిడిపి నాయకులు ఘనస్వాగతం పలికారు.
అక్కడి నుంచి రతన్ టాటా క్యాంపు కార్యాలయం చేరుకుని చంద్రబాబుతో సమావేశమయ్యారు. టాటా ట్రస్టు ఆధ్వర్యంలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై ఇరువురు చర్చించారని తెలుస్తోంది.
కాగా విజయవాడ లోకసభ నియోజకవర్గ పరిధిలోని 264 గ్రామాలను టాటా ట్రస్ట్ దత్తత తీసుకునేందుకు అంగీకరించింది. అంతకుముందు బాలకృష్ణ చంద్రబాబుతో భేటీ అయీ హిందూపురం అబివృద్ధిపై చర్చించారు.