రోహిణి కార్తె ఇంకా రానేలేదు.. అప్పుడే రోలు పగిలింది.. మున్ముందు ఇంకెలాగుంటుందో?
రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని అంటుంటారు మన పెద్దలు. కానీ రోహిణి కార్తె ఇంకా ప్రవేశించనే లేదు.. అప్పడే ఎండ దెబ్బకు ఓ రోలు పగిలింది.
మార్కాపురం: రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని అంటుంటారు మన పెద్దలు. కానీ రోహిణి కార్తె ఇంకా ప్రవేశించనే లేదు.. అప్పడే ఎండ దెబ్బకు ఓ రోలు పగిలింది. నిజానికి క్యాలెండర్ ప్రకారం మే నెల 25 వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభమవుతుంది.
కానీ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం భానుడి చండ ప్రచండ తీక్షణతకు ఓ రోలు మూడు ముక్కలైంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రోహిణి కార్తె ప్రవేశించిన తరువాత ఇంకెలాగుంటుందో?
ఇది చూసిన వాళ్లంతా రోహిణి కార్తె నానుడి నిజమేనంటూ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెట్రేగిపోతున్న మండుటెండలకు ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో వడగాడ్పులు కూడా అధికమయ్యాయి.
కొన్నిచోట్ల రోడ్డుపై వెళ్లే వాహనాలు సైతం నిలువునా తగలబడిపోతున్నాయి. ఈ ఎండల వేడికి తాళలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. మరో నాలుగు రోజుల వరకు ఈ వడగాడ్పుల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడమే ప్రజలకు శ్రేయస్కరం. బయటికి వెళ్లేప్పుడు చల్లటి నీరు అందుబాటులో ఉంచుకోవడం, అలాగే తరచూ చల్లని మజ్జిగ తాగడం మంచిది. అల్పాహారంగా రాగిజావను తీసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది.
వృద్ధులు, పురుషులు, మహిళలు, పిల్లలు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి, నీడపట్టున ఉండటం ద్వారా వడగాడ్పుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైన పని ఉంటే తప్ప ఎండలోకి వెళ్లకపోవడమే శ్రేయస్కరమని స్పష్టం చేస్తోంది.