పీఛే ముడ్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని ఉత్తదే
హైదరాబాద్: తాత్కాలిక రాజధాని ఏర్పాటు అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా విరమించుకున్నట్లేనని అంటున్నారు. ఉద్యోగులు ఆంగీకరిస్తే దశలవారీగా కొన్ని కీలక శాఖల హెచ్వోడీలను రాజధాని ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు నిర్ణయించింది.
సచివాలయంలో మంగళవారం మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్, పెట్టుబడులు, ఇంధన, మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు సమావేశమయ్యారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక రాజధానిని నిర్మించడమా లేక అదనపు వ్యయాన్ని తగ్గించుకుని శాశ్వత రాజధానికే మొగ్గుచూపాలా అనే అంశంపై చర్చలు జరిపారు. ఉద్యోగుల విముఖత, భారీ వ్యయం వంటి కారణాలే కాకుండా ఇప్పటికిప్పుడు నిర్మాణం ప్రారంభించినా జూన్నాటికి సిద్ధమయ్యే పరిస్థితి లేకపోవడంతో తాత్కాలిక రాజధాని ప్రతిపాదనను విరమించుకున్నారు.
అయితే, ప్రజలతో నేరుగా సంబంధాలున్న రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల వంటి కొన్ని కీలక శాఖల హెచ్వోడీలను మాత్రం విజయవాడ, నాగార్జున యూనివర్సిటీలోని భవనాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దాన్ని కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించి వారు ఒప్పుకొంటేనే చేపట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు పదో తేదీన ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కావాలని, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వారితో మాట్లాడకుండా ఏ నిర్ణయం తీసుకున్నా సరికాదని అభిప్రాయపడ్డారు. సమావేశం తర్వాత మంత్రి నారాయణ మాటలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.