ముద్రగడ పోరు: అడకత్తెరలో తెలుగు తమ్ముళ్లు: కిర్లంపూడిలో టెన్షన్ టెన్షన్
కాపులకు రిజర్వేషన్ కల్పించాలని సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ‘చలో అమరావతి’ పాదయాత్రతో తూర్పు గోదావరి జిల్లాలో హైటెన్షన్ చోటు చేసుకుంది.
అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాపులకు రిజర్వేషన్ కల్పించాలని సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన 'చలో అమరావతి' పాదయాత్రతో తూర్పు గోదావరి జిల్లాలో హైటెన్షన్ చోటు చేసుకుంది.
ఆయన పాదయాత్రకు ఒక్క రోజు గడువు మాత్రమే ఉండటంతో ఉత్కంఠ నెలకొన్నది. అటు ప్రభుత్వం, ఇటు ముద్రగడ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వాతావరణం వేడెక్కింది.
ఉద్యమకారులను అడ్డుకోవడానికి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. పాదయాత్ర జరిగే తూర్పుగోదావరి నుంచి గుంటూరు జిల్లా వరకూ ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి కాపు నేతల కదలికలపై నిఘా పెట్టింది.
ఎప్పుడేమీ జరుగుతుందోనని ఆందోళన
ముద్రగడ సొంతూరు కిర్లంపూడి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ఎప్పుడేమీ జరుగుతుందోనని ప్రజలంతా భయపడుతుంటే, అధికార టీడీపీ నేతల పరిస్థితి మరో రకంగా ఉంది. అడకత్తెరలో పోకచెక్కలా వారి పరిస్థితి తయారైంది. ఉద్యమానికి దూరమైతే కాపు సామాజిక వర్గం దూరమవుతుందని గుబులు వెంటాడుతుండగా, పోరాటానికి దగ్గరైతే అధిష్టానం ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందేమోనని భయం పట్టుకున్నది.
Recommended Video
తెలుగు తమ్ముళ్లకు ముందు నుయ్యి వెనుక గొయ్యి
ముద్రగడ ఆందోళన కాపు జాతి కోసం జరుగుతున్న పోరాటంగా నిలిచిపోయింది. ఉద్యమానికి సహకరించని కాపులు ద్రోహులుగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడా సంక్లిష్ట పరిస్థితిని టీడీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కారణంగా అధికార పార్టీ నేతలు కాపు ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. పదవులు పోతాయని, చంద్రబాబు ఆగ్రహానికి గురి కావల్సి ఉంటుందని జేఏసీ నేతలను పలుకరించడానికి కూడా భయపడుతున్నారు. దీంతో ఇప్పటికే ఆ నేతలను సదరు కాపు సామాజిక వర్గం చీత్కరించుకుంటోంది.
రిజర్వేషన్ కోసం పోరాడాల్సిందిపోయి తిరిగి ఉద్యమాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే పదవులు ఉన్నాయి, భవిష్యత్లో తమ పరిస్థితేమిటనే భయం టీడీపీ నేతలకు పట్టుకున్నది. ఎందుకంటే, ఉద్యమం కారణంగా ఇప్పటికే కాపు సామాజిక వర్గం మండిపోతోంది. టీడీపీ నేతలను కాపులు ఏ దశలోనూ అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. కాపు జేఏసీ నాయకులు కూడా చంద్రబాబు, టీడీపీ నేతల్ని టార్గెట్ చేసుకునే ఉద్యమం చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతల్లో చెప్పుకోలేని టెన్షన్ మొదలైంది. ఏదేమైనా ముందుకెళితే నుయ్యి- వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంగా పచ్చనేతల పరిస్థితి తయారైంది.
అడ్డుకుంటామంటున్న పోలీస్ ఉన్నతాధికారులు
మరోవైపు తమకు రిజర్వేషన్లు అమలు చేసే విషయమై కాపులు, వారి ఆందోళనను అణచివేసేందుకు ప్రభుత్వం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవడంతో పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అనుమతి లేని పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామని పోలీసులు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరుతామంటూ ముద్రగడ బృందం తేల్చి చెబుతోంది. తమకిది చావోరేవోలాంటిదని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేయడంతో వాతావరణం వేడెక్కింది.
ముద్రగడ ఇంటిచుట్టూ బారికేడ్లు
ముద్రగడ పద్మనాభాన్ని ఇంటి నుంచే కదలనివ్వకూడదనే ఉద్దేశంతో పోలీసులు కిర్లంపూడిలోని ఆయన ఇంటిని అదుపులోకి తీసుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో అడుగుకో పోలీసు అన్నట్లుగా మోహరించారు. తూర్పుగోదావరిలో రెండు రోజుల క్రితమే ఏడువేలకుపైగా పోలీసులను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ రంగంలోకి దించారు. కాపుల ప్రాబల్యమున్న గ్రామాలను దిగ్బంధం చేస్తున్నారు. చెక్పోస్టులు, ఔట్ పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. కీలకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పెట్టడంతోపాటు డ్రోన్ కెమెరాల సాయంతో కాపుల కదలికలను తెలుసుకుంటున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నేత జక్కంపూడి గణేష్పై కూడా బైండోవర్ కేసు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వీ హనుమంతరావును సోమవారం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.
నిఘా నీడలో జాతీయ రహదారులు
తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోని గ్రామాలు, జాతీయ రహదారులపై సుమారు 95 పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. కిర్లంపూడి చుట్టూ ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, అవుట్ పోస్టులతో రహదారులన్నీ నిఘా వలయంలో ఉన్నాయి. ఒకవైపు పోలీసుల కవాతు, మరోవైపు కాపుల సమరభేరీతో తూర్పు గోదావరి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెక్షన్ 144, సెక్షన్ 30తో పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్నారు. కాపులు ఉన్న గ్రామాలనైతే దాదాపు దిగ్బంధం చేస్తున్నారు. ఏ ఒక్కర్నీ బయటికి రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీసు వర్గాల్లో డైలమా
ఆరు నూరైనా పాదయాత్ర చేస్తామంటూ జేఏసీ నాయకులు ధీటుగా స్పందించడంతో కిర్లంపూడిలో యుద్ధ వాతావరణం నెలకుంది. బైండోవర్, హెచ్చరికలు, నోటీసులు ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. చట్టం తన పనిచేసుకుపోతుందనే ధోరణితో పోలీసులు అన్ని రకాల ఆంక్షలు పెడుతున్నారు. చావో రేవో తేల్చుకుంటామంటూనే బుధవారం పాదయాత్ర అడ్డుకుంటే, మరో రోజు ప్రారంభిస్తామని, తమదెలాగూ నిరవధిక పాదయాత్ర అని ముద్రగడతోపాటు జేఏసీ నాయకులు తేల్చేయడంతో పోలీసు వర్గాలు డైలామాలో పడ్డాయి.