గోదావరి రైతులకు జీవన్మరణ సమస్యగా ఆక్వాపార్కు: ప్రశ్నించే జనసేన.. సీఎం కావాలని ఆకాంక్షించే జగన్ ఎక్కడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన ఆక్వాపార్కు నిర్మాణంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన ఆక్వాపార్కు నిర్మాణంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆక్వాపార్కును ఇక్కడ నుంచి తరలించేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్న కె.బేతపూడి, తుందుర్రు, జొన్నలగరువు పరిసరాల్లో 30 గ్రామాల ప్రజలు యంత్రాలతో వచ్చే లారీలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం యాజమాన్యం 30 కంటైనర్లు, 20 వరకు లారీల్లో యంత్రాలను తీసుకొస్తుండగా రక్షణగా 400 మందికిపైగా పోలీసులు మోహరించారు.
30 గ్రామాల ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిన ఆక్వా ఫుడ్ పార్క్ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొరపాటు చేస్తే ప్రశ్నిస్తానని, నిలదీస్తానని మీడియా ముందు కబుర్లు చెప్పే జనసేనాధిపతి పవన్ కల్యాణ్, రెండేళ్లలో అధికారం తనదేనని కలలు కంటున్న ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి మాత్రం ఈ పార్క్ నిర్మాణం సంగతి గానీ, వేల మంది ప్రజల భవితవ్యం గురించి గానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆందోళనల నివారణకు పోలీసుల యత్నం
ఆనంద గ్రూపు యాజమాన్యం ‘మెగా ఆక్వా ఫుడ్ పార్కు' నిర్మాణం కోసం తీసుకొచ్చిన యంత్రాలను దించకుండా కె బేతపూడి ప్రజలు అడ్డుకునే ప్రయత్నించారు. ఆందోళనకారులు కిరోసిన్, పెట్రోల్, కారప్పొడిలతో దాడులు చేసినా పోలీసుల బందోబస్తు మధ్య యంత్రపరికరాలు ఆక్వాపార్కుకు చేరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో గతంలో దీనిపై సమావేశాలు జరిగినా ఈ సమస్య అపరిష్కృతంగానే ఉంది. ‘‘పార్కు నిర్మాణం కొనసాగుతుంది.. మీ భయాలు తొలగించేందుకు ఏం చేయమంటే అది చేస్తాం'' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం తమ వాదనకే కట్టుబడి సాగుతున్నారు. వీటన్నింటి మధ్య పార్కు నిర్మాణం పీటముడిలా తయారైంది.
Recommended Video
విష వాయువులతో ఆరోగ్యం కబళిస్తుందని ఆందోళన
ఆక్వాపార్కు తమ బతుకుల్లో అంధకారం నింపుతుందనేది స్థానికుల భయం. తాగు, సాగునీటి వనరులు దెబ్బతింటాయనే ఆందోళన. అందులో నుంచి వెలువడే విషవాయువులు తమ ఆరోగ్యాన్ని కబళిస్తాయని కలవరం. అందుకే గోదావరి ఆక్వా మెగా ఫుడ్పార్కు నిర్మాణాన్ని అక్కడ నుంచి తరలించాల్సిందేననే డిమాండుతో పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు, కె బేతపూడి, జొన్నలగరువు గ్రామాల ప్రజలు అభ్యర్థనలతో ఆందోళన బాట పడుతున్నాయి.
ముందు తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే స్థానికుల వేదనకు ఏ వాదనలు సంతృప్తికర సమాధానాలుగా నిలబడలేకపోతున్నాయి. ఏది ఏమైనా ఈ పరిశ్రమతో మానవ జీవనానికి ముప్పు ముప్పే అనే స్థిరమైన అభిప్రాయంతో స్థానికులు ఉన్నారు. ఆక్వాపార్కు యాజమాన్యం మాత్రం ‘కాలుష్యం లేకుండా చేస్తాం, చుక్కనీరు కూడా బయటకు వదలబోము' అని వాదిస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యర్థాలు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.
స్థానికుల నుంచి ఆక్వా పార్క్పై ఇలా నిరసన
కానీ ఇటీవలే హైదరాబాద్ నగరం నుంచి గుట్టు చప్పుడు కాకుండా సెప్టిక్ ట్యాంకుల్లో పారిశ్రామిక సంస్థలు వ్యర్థాలను రాజధాని నగరాన్ని దాటించి మూడో కంటికి తెలియకుండా మూసీలో పడబోసిన సంగతి తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ మండలి అధికారులు బయట పెట్టారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో నిర్మించే ఆక్వాఫుడ్ పార్క్ నుంచి వెలువడే కాలుష్య కారక నీటిని సముద్రం వరకు గొట్టపు మార్గం ద్వారా తరలిస్తామని యాజమాన్యం చేస్తున్న వాదనలు కూడా ఉంటాయి.
ఒకసారి పార్క్ నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోతుంది సుమా.. ఆ తర్వాత గొట్టపు మార్గం నిర్మాణం పక్కన బెట్టి ఇతర అంశాలపై ద్రుష్టి సారించేలా చేయడంలో పారిశ్రామిక వేత్తలు దిట్టలు మరి. గొట్టపుమార్గం నిర్మించి సముద్రానికి చేరవేసేందుకు ఆక్వాపార్కు యాజమాన్యం ప్రణాళికలు తయారు చేస్తున్నా సరే స్థానికులు మాత్రం ఆ పార్క్ ఏర్పాటే వద్దన్న మాటకు కట్టుబడి ఉండటంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.
యనమదురు డ్రెయిన్ ఇలా ప్రారంభం
తణుకు మండలం నుంచి యనమదురు డ్రెయిన్ ప్రారంభమవుతుంది. కొంతదూరం గోస్తనీ నది ప్రవహిస్తుంది. ఒకప్పుడు ఇందులో నీరు తాగడానికి ఉపయోగించేవారు. ఇపుడు కాలుష్యంతో నిండిపోయింది. యనమదురు డ్రెయిన్తోపాటు చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాన్ని శుద్ధి చేసి సముద్రానికి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా కేంద్రం (నీరి) ఆధ్వర్యంలో దీనిపై అధ్యయనం జరుగుతోంది. కాలుష్యం మొదలయ్యే తణుకు నుంచి సముద్రం లోపల 500 మీటర్ల దాకా మొత్తం 65 కిలోమీటర్ల దూరం గొట్టపు మార్గం నిర్మిస్తారు.
రోజుకు 25 మిలియన్ లీటర్ల తరలింపు సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తారు. తణుకు, భీమవరం మున్సిపాలిటీల నుంచి వచ్చే వ్యర్థ´ జలాన్ని శుద్ధి చేసేందుకు అదనపు ప్లాంట్లు నిర్మిస్తారు. పరిశ్రమలకు ఒకటి, మున్సిపాలిటీలకు మరోటి చొప్పున రెండు రకాల గొట్టపుమార్గాలు యనమదురు పక్కనే ముందుకు సాగుతూ భీమవరం దిగువన కలుస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేసే పెద్ద శుద్ధిప్లాంటులోశుద్ధి చేసి ఒక గొట్టపుమార్గం ద్వారా సముద్రం లోపలకు తీసుకెళ్లేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అవసరమైతే ఆక్వాపార్క్ నుంచి భీమవరంలోని శుద్ధిప్లాంట్ దాకా మరో పైపులైన్ వేసి వ్యర్థ జలాలు తరలించవచ్చనే ప్రతిపాదనలు తెరపైకొస్తున్నాయి.
భావి తరాలను రక్షించాలని వేడికోళ్లు
తమ గ్రామాల పక్కనే ఆక్వాపార్క్ పెట్టొద్దని పునాది వేసినప్పటి నుంచి వద్దంటున్నామని కె బేతపూడి వాసులు తెలిపారు. మా ఆరాటం... పోరాటం అంతా భవిష్యత్తు తరాల ఆరోగ్యం కోసమని వివరించారు. ‘‘మా అమ్మగారి వూరు రేలంగి. ఒకప్పుడు అక్కడ గోస్తనీనదిలో స్నానాలు చేసేవాళ్లు. ఇప్పుడు అటు వెళ్లాంటే ముక్కుమూసుకోవాల్సి వస్తోంది. అడుగు పెడితే కాళ్లకు దద్దుర్లు వస్తున్నాయి. భూగర్భజలాలు కలుషితమై ఇళ్లలో వస్తువులు కూడా పాడైపోతున్నాయి. మొగల్తూరులో అమ్మోనియా లీకై అయిదుగురు చనిపోయారు. వారిని బతికించండి.
ఆందోళన మానేస్తాం. మా పిల్లలకు ఆస్తులివ్వకపోయినా పర్లేదు.. ఆరోగ్యం కావాలిగా! ప్రాణం పోయాక చేసేదేముంది? వద్దంటున్నామని నన్ను, మా అబ్బాయిని జైల్లో పెట్టారు. మా ప్రాణాలు పోయినా సరే ఆక్వాపార్కుని అడ్డుకుంటాం' అని ఆమె సరస్వతి ధ్రుడ నిశ్చయంతో చెప్పారు. తమ సొంతింటికి రావాలన్నా ‘ఆధార్' కార్డు చూపాలనే వింత పరిస్థితి నెలకొన్నదని కే బేతపూడివాసి సముద్రాల సత్యవాణి వాపోయారు. కానీ ‘ఎలాంటి కాలుష్యం లేకుండా పరిశ్రమ నిర్వహిస్తాం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కు ఆక్వా రైతుల కోసమే'' అని ఆక్వాపార్కుకు సారథ్యం వహిస్తున్న ఆనంద గ్రూప్ ఛైర్మన్ విశ్వనాథరాజు చెప్పారు.
పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళన
గ్రామాలకు ఆనుకునే ఆక్వాపార్కు నిర్మించడం వల్ల వాటి నుంచి వచ్చే వ్యర్థాలతో తాగు, సాగు జలాలు కలుషితం అవుతాయి. వాటిని గొంతేరు డ్రెయిన్లోకి వదిలితే దానిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు దెబ్బతింటాయి. గొంతేరు ఎత్తిపోతల పథకంపై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలొ 20కి పైగా గ్రామాలు ఆధారపడి జీవిస్తున్నాయి. తద్వారా ఈ ఆక్వాపార్క్ యనమదురు డ్రెయిన్లా కాలుష్యకారకంగా మారుతుంది. ఇక యనమదురు డ్రెయిన్లో ఎవరైనా కాలుజారి పడినా దిగి రక్షించాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు.
గొంతేరు కూడా అలా తయారైతే దానిపై ఆధారపడిన మూడు ఎత్తిపోతల పథకాల ఆయకట్టు ప్రశ్నార్థకమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ ఆక్వా పార్క్ నిర్మాణంతో ముఖ్యంగా మత్స్యకారుల ఉపాధి పోతుందని, పరిశ్రమలో ఉపయోగించే అమ్మోనియా లీకైతే ప్రాణాలకే ప్రమాదమని చెప్తున్నారు. ఈ గొంతేరు పరిధిలోని ఎత్తిపోతల పథకాల పరిధిలో కాల్వలకు వచ్చే నీటిని ఆక్వా పార్కుకు మళ్లిస్తే పంటలకు ఇబ్బందులు తలెత్తుతాయని వాపోతున్నారు. మెగాపార్కు బదులు ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకుంటే తమంతా సహకరిస్తామని రైతులంతా ముక్తకంఠంతో హామీ ఇస్తున్నారు.
కాలుష్య నియంత్రణ ఇలా నేతిలో బీరకాయ చందమే
ఆక్వా మెగా ఫుడ్పార్కు నుంచి ఒక్క చుక్క కూడా బయటకు వెళ్లకూడదనే షరతుపైనే అనుమతి ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వాదిస్తున్నది. ఈ పరిశ్రమ నుంచి విడుదల అయ్యే కలుషిత నీటిని శుద్ధి చేసి అక్కడ పంటలసాగుకు ఉపయోగించుకోవచ్చునని నమ్మబలుకుతోంది. ఇందుకు 50 ఎకరాల వరకు అందుబాటులో ఉన్నదని వాదిస్తోంది. నీటి నుంచి ఎలాంటి విషపదార్థాలు వెలువడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్న కాలుష్య నియంత్రణ మండలి చుట్టుపక్కల భూగర్భజలాలు కాలుష్యమవుతాయనే వాదన సరికాదని ఎదురు దాడికి దిగుతున్నది.
కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా పలు ఫార్మా పరిశ్రమల ఏర్పాటుతో నాచారం, మల్లాపురం, జీడిమెట్ల, చర్లపల్లి పారిశ్రామిక వాడలన్నీ పూర్తిగా కలుషితమైన నేపథ్యం భాగ్య నగర వాసులు మరిచిపోలేదు. హైదరాబాద్ నగరంలోనే కలుషితాల నివారణకు చర్యలు చేపట్టని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో తుందుర్రు పరిధిలో ఏర్పాటు చేసే ఆక్వాపార్కు నుంచి కలుషితాలు, వ్యర్థాలు విడుదల కాకుండా చూస్తామని నమ్మబలకడం ‘నేతి బీరకాయలో నెయ్యి' చందమేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది.
రొయ్యలు శుద్ధి చేసిన తర్వాత ఆయా జలాల్లో అమినో యాసిడ్స్ మాత్రమే ఉంటాయని, ఇది పూర్తిగా ఆహార శుద్ధి పరిశ్రమ. ఇక్కడ నుంచి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తారని నచ్చ చెప్పడానికి విఫలయత్నం చేస్తున్నది. యనమదురు డ్రెయిన్పై గొట్టపుమార్గం ఏర్పాటు చేస్తున్నామని, ప్రజల్లో భయాలు తొలగించేందుకు ఆక్వా ప్లాంట్ నుంచి వచ్చే నీటిని అందులోకి తీసుకెళ్లే వీలున్నదని అంటున్నది.
ఈ పార్కుకు ఇలా అనుమతులు
గ్రామాలకు 500 మీటర్లకు పైగా దూరంలోనే ఆక్వా పార్కులో ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంటుందని, ప్రాసిసింగ్ తర్వాత వచ్చే నీరు ఒక్క చుక్క కూడా బయటకు వదలబోమని ఆక్వాపార్కుకు సారథ్యం వహిస్తున్న ఆనంద గ్రూప్ ఛైర్మన్ విశ్వనాథరాజు చెప్పారు. ప్రాసెసింగ్ తర్వాత వచ్చే నీరు ఒక్కచుక్క బయటకు వదలమని, నీటిని శుద్ధిచేసి 27 ఎకరాల్లో అభివృద్ధి చేసే గ్రీన్బెల్ట్కు వినియోగిస్తామని తెలిపారు. వ్యర్థాలు గొంతేరులో కలుపుతామనేది సరికాదు. అక్కడకు తీసుకెళ్లాలంటే రైతుల పొలాల నుంచి వెళ్లాలంటే అసాధ్యమని, అమ్మోనియా వల్ల ప్రమాదం ఉండదు. విడుదలైన వెంటనే పైకి వెళ్తుంది.
అది గాలికంటే తేలిక స్వరూపంలో ఉంటుంది. ఆనంద గ్రూప్ చైర్మన్ విశ్వనాథరాజు సారథ్యంలో గోదావరి ఆక్వా మెగా ఆక్వా పార్కు ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటైంది. ప్రాథమికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2012 సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఆక్వా పార్కు నిర్మాణానికి అనుమతినిస్తే 2013 డిసెంబర్ 16వ తేదీన తుది దశ అనుమతి లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు, నర్సాపురం మండలం కే బేతపూడి గ్రామాల పరిధిలో 55.65 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ నిర్మించ తలపెట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.122.60 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. గత నెలాఖరు నాటికి రూ.42.32 కోట్లు ఖర్చు చేసింది.
ఈ మెగా ఆక్వా పార్క్ ఏర్పాటుతో అనుబంధంగా 30 పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. 750 మందికి ఉపాధి లభిస్తుంది. ఎగుమతులకు వీలుగా రొయ్యలు, చేపలు ప్రాసెసింగ్ చేసింది. రోజుకు 30 నుంచి 40 టన్నుల రొయ్యల ప్రాసెసింగ్ చేపట్టింది. మూడు వేల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండడంతో ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం లభిస్తుందని అంచనా.