తెరాస విధ్వంసం: టీడీపీ బంద్ ఉద్రిక్తం, రేవంత్ అరెస్టు
నల్గొండ: నల్గొండ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నల్గొండ జిల్లా బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇది బుధవారం ఉద్రిక్తతకు దారి తీసింది. నల్గొండకు బయలుదేరిన తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు, రమేష్ రాథోడ్, రేవంత్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
నల్గొండ జిల్లా టీడీపీ కార్యాలయంపై తెరాస నేతలు దాడి చేయడాన్ని వారు ఖండించారు. వారు బందులో పాల్గొనేందుకు బయలుదేరారు. రమణ, మోత్కుపల్లి, ఎర్రబెల్లిలను పోలీసులు అరెస్టు చేసి రామన్నపేట పోలీసు స్టేషన్కు తరలించారు. రేవంత్, రమేష్ రాథోడ్లను బూదాన్ పోచంపల్లి కొత్తగూడెం వద్ద అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందన్నారు. నిరసన చెప్పేందుకు వెళ్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కాగా, చిట్యాల పోలీసు స్టేషన్ వద్ద తెరాస, టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి.
కాగా, శ్రీశైలం నీటి వినియోగం.. విద్యుదుత్పత్తిని నిలిపివేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం తెలంగాణలో తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా టీడీపీ కార్యాలయానికి తెరాస కార్యకర్తలు నిప్పు పెట్టారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలోని ఫ్లెక్సీలు, కుర్చీలు దహనం చేశారు. స్థానిక టీడీపీ కార్యకర్లు, పోలీసులు మంటలను ఆర్పేశారు. అనంతరం గడియారం చౌరస్తాలో ధర్నా చేశారు. టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన కొద్ది సేపటికి కొందరు కార్యాలయంలోకి వెళ్లి ఫ్లెక్సీలను తగులబెట్టారు.
పైఅంతస్తులోకి వెళ్లి అక్కడ కుర్చీలు కుప్పగా పోసి నిప్పు పెట్టారు. టీడీపీ కార్యకర్తలు వచ్చి మంటలను ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, టీడీపీ కార్యాలయం తగులబెట్టడం దేనికి సంకేతమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నించారు.