బాబువల్లే పని చేశా: టిజి, రాజకీయాలొద్దనుకొని: ఏరాసు
తాము టిడిపిలో చేరడంపై ఓ వర్గం మీడియా వ్యంగ్యంగా స్పందిస్తోందని కానీ, విభజన జరిగితే పార్టీలో ఉండమని తాము మొదటనే చెప్పామన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని, టిడిపి కాకుండా మిగతా రెండు పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదన్నారు. టిడిపియే ప్రత్యామ్నాయమన్నారు.
తమకు పార్టీ పెట్టి నడిపే శక్తి లేదన్నారు. చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి చెందుతుందని తాము బలంగా నమ్ముతున్నామన్నారు. మంచివాళ్లను చేర్చుకుంటామని చెప్పి చంద్రబాబు తమను పార్టీలోకి ఆహ్వానించారన్నారు. బాబు వద్ద గతంలో రాజకీయ శిక్షణ తీసుకున్నందువల్లే మంత్రిగా బాగా పని చేశామన్నారు.
రాబోయే కాలంలో కాబోయే సిఎం
చంద్రబాబు రాబోయే కాలంలో కాబోయే సిఎం అని ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. విభజనతో సీమాంధ్రకు నష్టమని చెప్పినా కాంగ్రెసు పార్టీ అధిష్టానం వినలేదని ఆరోపించారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చే శక్తి చంద్రబాబుకే ఉందన్నారు. ఓ దశలో తాను రాజకీయాల నుండి తప్పుకోవాలనుకున్నానని కానీ, ఇప్పుడు టిడిపిలో చేరుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. విభజనపై కాంగ్రెసు పార్టీది ఏకపక్ష నిర్ణయమన్నారు.