హోదా ఇస్తేనే ఏపీకి మేలు: టీజీ వెంకటేశ్, వెంకయ్యనూ లాగారు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఏపీ పునర్ వ్వవస్థీకరణ చట్టం, హమీల అమలపై రాజ్యసభలో గురువారం సాయంత్రం చర్చ జరిగిన సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు.
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందిన సమయంలో ఏపీకి ఐదేళ్లు పాటు ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని ప్రకటించారని టీజీ వెంకటేష్ అన్నారు. ఈ క్రమంలో ఏపీకి ఐదేళ్లు హోదా సరిపోదని, కనీసం పదేళ్లు హోదా కావాలని ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
ఆర్ధిక లోటుతో సతమతమవుతున్న ఏపీ అభివృద్ధి కావాలంటే అవసరమైన సహాయం చేస్తామని విభజన చట్టంలో ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆర్ధిక లోటు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆయన తెలిపారు. హోదా ఇస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు అందుకు సహకరించడం లేదని ఆయన అన్నారు. ఏపీలో 2019 వరకు ఆర్థిక లోటు ఉంటుందని ఆర్థిక సంఘం చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కావాలని ఆయన తెలిపారు.