అత్యాచార బాధితురాలికి టీజీ పరామర్శ: 2 లక్షల ఆర్ధిక సాయం
హైదరాబాద్: ఓ కామాంధుడి చేతిలో అత్యాచారాని గురై కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల అత్యాచార బాధితురాలిని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు.
కుటుంబ సభ్యులకు తన కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని టీజీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు ఖాజాఖాన్కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని టీజీ హామీ ఇచ్చారు.
గత ఆదివారం ఏడేళ్ల బాలికపై ఖాజాఖాన్ బాషా అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కర్నూలు పట్టణంలోని కడగ్పూరా కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కడగ్పూరా కాలనీకి చెందిన ఖాజాఖాన్ బాషా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు.
గత శనివారం రాత్రి తమ ఇంటి పక్కనే ఉన్న ఏడేళ్ల పాపను ఎత్తుకెళ్లి శనివారం రాత్రి పాపపై అత్యాచారం చేసి ఆదివారం ఉదయాన్నే వదిలేయడంతో ఇంటికి చేరింది. తల్లిదండ్రులు జరిగిన విషయంపై ఆరా తీసి బాషాను పట్టుకొని చితకబాదారు.
విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆసుపత్రిలో చేర్పించారు. కేసు కూడా నమోదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నిందితున్ని అప్పగించాలని తాము శిక్షిస్తామని పాతబస్తీవాసులు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదుట ధర్నా కూడా చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిందితున్ని ఇక్కడ ఉంచితే ప్రమాదమని గుర్తించిన పోలీసులు ఆందోళనకారుల కళ్లు కప్పి పలు వాహనాలు మారుస్తూ కడప సెంట్రల్ జైల్కు తరలించారు. ప్రస్తుతం ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు ఖాజాఖాన్ బాషా కడప సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.