నారాయణ కొడుకు వాడిన కారు నాది కాదు, డబ్బులు కట్టలేక అమ్మేశా: పవన్ కళ్యాణ్
ఏపీ మంత్రి పీ నారాయణ తనయుడు నిషిత్ ఉపయోగించిన కారు తనది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు వెల్లడించారు.
హైదరాబాద్: ఏపీ మంత్రి పీ నారాయణ తనయుడు నిషిత్ ఉపయోగించిన కారు తనది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు వెల్లడించారు.
నిషిత్ ప్రమాదానికి గురైన కారు మీదేనట కదా? అని ఒక విద్యార్థి అడగగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఇలాంటి కారు గతంలో తన వద్ద ఉండేదని చెప్పారు. అయితే, ఆ కారు ఇన్స్టాల్మెంట్లు కట్టలేక చివరకు దాన్ని అమ్మేశానని చెప్పారు.
నిషిత్ ప్రమాదానికి గురైన కారు ఫొటోను తనకు ఈ ఉదయం ఒకరు చూపించారని అయితే, తాను కొన్న కారు నెక్స్ట్ మోడల్ నిషిత్ కారు అని పవన్ చెప్పారు.
బుధవారం వేకువజామున మంత్రి నారాయణ తనయుడు నిషిత్, ఆయన స్నేహితుడు రాజా రవివర్మ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
నిషిత్ కారు.. పవన్ కళ్యాణ్ స్పందన
ఈ ప్రమాదంలో నిషిత్ అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగిన బెంజ్ కారును వాడారు. అయితే ఈ కారు పవన్ కళ్యాణ్ది అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
పవన్ కళ్యాణ్ ఈ కారును అమ్మారని ప్రచారం జరుగుతోంది. దీనిపై జనసేన అధినేత స్పందించారు. నిషిత్ ఉపయోగించిన కారు తనది కాదు అని ఆయన స్పష్టం చేశారు.
ఇలా ప్రచారం..
2016లో తనకు ఎంతో ఇష్టమైన బెంజ్ కారును మంత్రి నారాయణకు పవన్ కళ్యాణ్ అమ్మేశాడని ప్రచారం సాగింది. అంతేకాదు, పవన్ కళ్యాణ్కు నిషిత్ వీరాభిమాని అని అంటున్నారు. అందుకే తన అభిమాన హీరో నడిపిన కారు తనకు కావాలని నిషిత్ మంత్రి నారాయణపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ప్రచారం జరిగింది.
అమ్మడం ఇష్టం లేకపోయినా అంటూ..
పవన్ కళ్యాణ్కు తనకు ఎంతో ఇష్టమైన ఈ కారును అమ్మడం ఏమాత్రం ఇష్టం లేదని, మంత్రి నారాయణ తన కొడుకు నిషిత్ కోసం చాలాసార్లు బతిమాలారని, దీంతో ఆయన అమ్మేశాడని ప్రచారం సాగుతోంది.
చిరంజీవిది అంటూ కూడా ప్రచారం..
మరో ప్రచారం కూడా సాగుతోంది. ఆ బెంజ్ కారు చిరంజీవిది అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. పవన్ కారు వేరు, ఈ కారు వేరు అంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ లాంటి కారునే నారాయణ తన కొడుకు కోసం కొన్నాడని మరికొంతమంది అంటున్నారు. దీనిపై విలేకరులు అడగగా.. పవన్ స్పందించారు. అది తన కారు కాదని తేల్చి చెప్పారు.