తెలుగు ఛానళ్ల మధ్య టీఆర్పీ యుద్ధం: టాప్లో టీవీ9
హైదరాబాద్: ప్రకటనల ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే టెలివిజన్ ఛానళ్ల టిఆర్పి రేటింగ్ ఎక్కువగా ఉండాలి. ఎంత ఎక్కువ రేటింగ్ పాయింట్లు ఉంటే అంత ఎక్కువ ప్రకటనలు సంపాదించడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఛానళ్ల మధ్య రేటింగ్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది తెలుగు ఛానళ్ల మధ్య ఇంకా ఎక్కువగా ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో వార్తా ఛానళ్లు ఉండటంతో టిఆర్పీ రేటింగ్ కోసం ఆ ఛానళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. గత కొన్ని వారాల నుంచి ఓ మూడు ఛానళ్లు అగ్రపీఠంపై కన్నేసి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కాగా, టీఆర్పీ ఛార్ట్లో టీవీ9 అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో టీవీ5, ఎన్టీవీ ఉన్నాయి. ఈ రెండు ఛానళ్లు కూడా టీవీ9కి అతి సమీపంలో ఉండటం గమనార్హం.
గత రెండు వారాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే.. టీఆర్పీ రేటింగ్ 131/132 నుంచి 141/131కు పెంచుకుని టీవీ9 అగ్రస్థానాన్ని కాపాడుకుంది. అదే విధంగా టీవీ5 121/126 నుంచి 132/121 రేటింగ్ పాయింట్లు సాధించి ఎన్టీవీని పక్కకు నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది. 15ప్లస్ ఏజ్ గ్రూప్లో 122/125 నుంచి 118/122 రేటింగ్ పాయింట్లకు తగ్గిన ఎన్టీవీ మూడో స్థానంలో కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలకు ఒకే ఛానళ్లు కొనసాగుతుండటంతో రెండు రాష్ట్రాలకు ఒకే రేటింగ్ పాయింట్లను కేటాయించడం జరుగుతుందని సంస్థ పేర్కొంది.
తెలుగు ఛానళ్లు తమ రేటింగ్ పాయింట్లను మూడు ప్రాంతాల్లోనూ పెంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి హైదరాబాద్ ప్రాంతం, రెండోది ఆంధ్రప్రదేశ్(విజయవాడ, విశాఖపట్నం), మూడో ప్రాంతం పదిలక్షలకు తక్కువగా జనాభా కలిగిన నగరాలు, పట్టణాలు. వీక్షకుల ఏజ్ గ్రూప్ కూడా ఇందులో కీలకమే. 15ప్లస్, 25ప్లస్ యువకులను కీలకంగా తీసుకోవచ్చు.
టీవీ9 2004లో ప్రారంభమైంది. ఓ కొత్త తెలుగు వార్తా ఛానల్ అవసరమున్న సమయంలో టీవీ9 రావడంతో దానికి అమితమైన ప్రజాదరణ లభించింది. ప్రతీ రోజూ బ్రేకింగ్ న్యూస్, వార్తలను అందించడంలో వినూత్న పోకడలతో టీవీ9 అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అగ్రస్థానాన్ని కాపాడుకుంటోంది.
టీవీ5 సాంప్రదాయక పద్ధతిలో వార్తలను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కాగా, వార్తలను అందించడంలో టీవీ9 బాటలోనే ఎన్టీవీ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రాకు చెందిన వ్యాపారవేత్త బిఆర్ నాయుడు సొంత సంస్థ అయిన శ్రేయాస్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టీవీ5ను నిర్వహిస్తున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త నరేంద్ర చౌదరి ఎన్టీవీకి ఛైర్మన్, ఎండిగా కొనసాగుతున్నారు. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నియంత్రణలో ఎన్టీవీ నిర్వహించబడుతోంది. కాగా, ఆసక్తికర కథనాలతో టీవీ9, మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన కార్యక్రమాలతో టీవీ5, రాజకీయ అంశాలతో ఎన్టీవీ ప్రజాదరణను చూరగొంటున్నాయి.