పోలీసులు సూదులతో గుచ్చుతున్నారు, బాబూ! పిచ్చాసుపత్రికి వెళ్తావా: రోజా
హైదరాబాద్: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీల పైన పోలీసులు సూదులతో దాడులు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆదివారం మండిపడ్డారు. అంగన్వాడీలకు పెంచిన జీతాలు తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం ఏపీని అడ్డంగా దోచేస్తోందన్నారు. ప్రపంచంలో ఎక్కడా 7 శాతం మించి వృద్ధి రేటు లేదన్నారు. అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదిహేను శాతం వృద్ధి రేటు అని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన దీనిని ముఖ్యమంత్రిగానే చెప్పారా అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఊహకు అందని, అసాధ్యమైన వృద్ధి లక్ష్యాలను కలలో చూసుకుంటున్నారని, తెల్లవారి వాటిని ప్రజలకు చెప్పి మభ్యపెడుతున్నారన్నారు. ఈ ఉదయం పత్రికల్లో వచ్చిన 15 శాతం వృద్ధి లక్ష్యం వార్తలను చూపుతూ... ఇంత జీడీపీ వృద్ధిని అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా సాధించడం లేదన్నారు.
ఏపీ ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు. ఈ లక్ష్యం సాధించగలిగింది కాదన్నారు. 15 శాతం జీడీపీ రేటు చైనాకు ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటించే మలేషియా, సింగపూర్లకు కూడా అంత వృద్ధి లేదన్నారు. ఓ ముఖ్యమంత్రిగా ఈ విషయాన్ని చెప్పారా? లేదా ఓ పోలిగాడిగా చెప్పారా? అన్నారు.
అసలు వృద్ధి రేటును ఎలా లెక్కిస్తారో కూడా తెలియకుండా ప్రకటనలు ఎలా చేస్తారన్నారు. సగం పొలాల్లో పంట నష్టపోయిందని, విభజన తర్వాత పరిశ్రమలు, ఐటీ హైదరాబాద్లో నిలిచిందని ఇలాంటప్పుడు డబుల్ డిజిట్ గ్రోత్ ఎలా సాధ్యమన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇంతటి వృద్ధి నమోదు కాలేదన్నారు. ఆయనను జైలుకు లేదా పిచ్చాసుపత్రికి పంపాల్సి ఉందన్నారు. ఎక్కడికి పంపాలో ఎంపిక చేసుకునే అవకాశం ఆయనకే ఇస్తున్నామన్నారు. రైతుల ఆత్మహత్యల్లో, విద్యార్థుల ఆత్మహత్యల్లో, మహిళలపై అత్యాచారాల్లో, చింతమనేని ప్రభాకర్ వంటి వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడంలో రికార్డులను నమోదు చేసుకున్నారన్నారు.