తిరుపతిలో అదృశ్యమైన ఇద్దరు బాలికలపై వరంగల్లో గ్యాంగ్ రేప్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎస్సీ హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై తెలంగాణలోని వరంగల్ జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. వారిలో ఓ బాలిక తప్పించుకుని తండ్రి చెంతకు చేరుకుంది. మరో బాలిక జాడ తెలియడం లేదు.
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ఈ నెల 24వ తేదీన ఊరి నుంచి హాస్టల్కు వచ్చారు. ఆ తర్వాత పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లిన ఆ ఇద్దరు బాలికలు తిరిగి హాస్టల్కు చేరుకోలేదు.
ఆ బాలికల అదృశ్యంపై హస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ రోజు తిరుపతిలో అదృశ్యమైన బాలికలు అదే రోజు రాత్రి వరంగల్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఆ బాలికలపై రైల్వే స్టేషన్లో చిల్లర సామాను అమ్ముకునే స్టాల్లో పని చేస్తున్న విశ్వనాథ్, సతీష్ దృష్టి పడింది.
వారు బాలికల వద్ద వెళ్లి విషయం అడిగారు. తాము తిరుపతి నుంచి వస్తున్నామని, అనుకోకుండా ఇక్కడ దిగామని బాలికలు చెప్పారు. తాము రైల్వే స్టేషన్లోనే పనిచేస్తున్నామని, కావాలంటే తమ గుర్తింపు కార్డులు చూడాలని చెప్పి వారిద్దరు బాలికలకు భోజనం పెట్టించారు. తమ గదిలో ఆశ్రయం ఇస్తామని నమ్మించారు.
ఆ తర్వాత గదికి తీసుకుని వెళ్లి అర్థరాత్రి సమయంలో బాలికలపై లైంగిక దాడికి దిగారు. విషయం తెలుసుకున్న విశ్వనాథ్, సతీష్ స్నేహితులు నజీర్, రాజేష్ - పోలీసులకు చెప్తామని బెదిరించి బాలికలపై లైంగికదాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.
ఆ తర్వాత ఓ బాలిక వారి నుంచి తప్పించుకుని విజయవాడకు చేరుకుంది. అయితే, విశ్వనాథ్, సతీష్ తనపై లైంగిక దాడికి పాల్పడబోగా తప్పించుకున్నానని బాలిక చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
చైల్డ్ లైన్ అధికారులు, పోలీసులతో కలిసి వరంగల్కు వచ్చిన ఆ బాలిక తమను నిర్బంధించిన గదిని చూపించింది. గదిలో విశ్వనాథ్ గుర్తింపు కార్డు, ఇతర ఆధారాలు లభించినట్లు సమాచారం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు.