ఫేస్బుక్లో పూజారి సూసైడ్ నోట్: ధర్మకర్తలు మందలించారనే..!
చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం ఉదయం కలకలం రేగింది. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ పూజారి సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్లో సూసైడ్ నోట్ను పెట్టి అదృశ్యమయ్యాడు. దీనిపై సుమోటో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పూజారి దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే... పట్టణంలోని బర్మావీధిలో ఉన్న షిరిడిసాయిబాబా మందిర ప్రధాన అర్చకుడు శివస్వామి, తన భార్య జ్యోతితో కలిసి నాలుగురోజుల కిందట అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో శివస్వామి సూసైడ్నోట్ వెలుగు చూసింది.
ఆలయ ధర్మకర్తలు మందలించిన కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పూజారి సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తాను పూజించే సాయిబాబా విగ్రహంతో కలసి ఫొటో తీసుకుని ఫేస్బుక్లో పెట్టినందుకు ధర్మకర్తలు దూషించారని ఆయన ఆ నోట్లో తెలిపాడు.
ఈ విషయమై టుటౌన్ సీఐ హనుమంత్నాయక్ను వివరణ కోరగా తమకు ఫిర్యాదు రాలేదని, సుమోటో కేసుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చిప్పిలిలో ఉన్న పూజారి శివస్వామి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.