టెక్కీ ఇంట్లో చోరీ: భార్య దాడిలో భర్త మృతి, వ్యభిచారం ముఠా పట్టివేత
హైదరాబాద్: సికింద్రాబాదు మోతీ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి 23 తులాల బంగారం ఆభరణాలను, రూ. 17 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ప్రవేశించి సొత్తంతా దోచుకుపోయారని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగారెడ్డి జిల్లాలోని కీసర ఈస్ట్ గాంధీనగర్లోని వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సంఘటనలో నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులను, ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి వివేకానందనగర్ లో కల్పన(29) అనే మహిళ ఉరేసుకుంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సమస్యలే వల్లే కల్పన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాద్లోని తుకారాంగేట్లో దారుణం జరిగింది. వేధింపులు భరించలేక భర్తపై భార్య, బంధువులు దాడి చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయాడు. భార్య రజిత, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దొంగ సొత్తుతో కూతురి నిశ్చితార్థం
మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేట మండలం కాశింనగర్ పోస్టుమాస్టర్ను బెదిరించి పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన మార్చి 26న చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారంనాడు అదుపులోకి తీసుకున్నారు. అయితే అపహరించిన డబ్బుతో కూతురి నిశ్చితార్థం చేశానని ఓ నిందితుడు పోలీసులకు తెలిపారు.
తుపాకీతో బెదిరించి రూ. 1.5 లక్షలను నిందితులు అపహరించారు. నిందితుల నుంచి తుపాకీ, రూ. 87 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు.