అనంతలో టిడిపికి కష్టమే, అందుకేనా మార్పులు, స్వపక్షంతోనే దెబ్బ?
పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం అనంతపురం జిల్లాలో టిడిపికి కష్టాలు తెచ్చిపెట్టనుంది.
అనంతపురం: పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం అనంతపురం జిల్లాలో టిడిపికి కష్టాలు తెచ్చిపెట్టనుంది. పార్టీ సీనియర్ల మద్య గొడవలను సమన్వయం చేసుకోకపోతే 2019 ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది.నేతల సమన్వయం చేసే బాధ్యతలను ఇద్దరు మంత్రులు తీసుకోవాలని పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు సూచించారు.
రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోట. అయితే అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ నాయకుల మధ్య ఉన్న విబేధాలు పార్టీని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఈ పద్దతిని మార్చుకోవాలని పార్టీ అధినేత నాయకులను హెచ్చరించారు.
పార్టీకి గట్టిపట్టున్నప్పటికీ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది.అయితే ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పార్టీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు సరిదిద్దే ప్రయత్నాలను చేపట్టారు.ఈ మేరకు ఇద్దరు మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులుకు అప్పగించారు.
అనంత మంత్రులకు బాబు టార్గెట్
మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో కాలువ శ్రీనివాసులుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే ఈ జిల్లా నుండి మంత్రివర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోల్పోయారు. అయితే ఆయనకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది.అయితే పార్టీ నాయకుల మద్య సమన్వయలోపాన్ని తగ్గించే బాధ్యతను జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులుకు బాబు అప్పగించారు.జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాలని బాబు ఇద్దరు మంత్రులకు చెప్పారు.
నేతల మధ్య సయోద్యకు కారణమిది?
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కు , స్థానిక ఎమ్మెల్యే చాంద్ బాషాకు మద్య సమన్వయమే లేదు. కందింకుంట ప్రసాద్ పరిటాల అనుచరుడు. చాంద్ బాషా కందికుంట ప్రసాద్ పై వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అయితే చాంద్ బాషా ఇటీవల టిడిపిలో చేరారు. వీరిద్దరి మద్య అసలు సమన్వయమే లేదు.ధర్మవరంలో నియోజకవర్గంలో సూరి(గోనుగుంట్ల సూర్యనారాయణ) కు , పరిటాల సునీత వర్గాలకు మధ్య సమన్వయం లేదు. ఈ నియోజకవర్గంలో ఈ రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నారు.ఈ రెండు గ్రూపులు ఈ నియోజకర్గంలో ఒకరిపై మరోకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
జెసి సోదరులకు, ప్రభాకర్ చౌదరి బహిరంగంగానే గొడవలు
అనంతపురం వేదికగానే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మద్య అంతరాలున్నాయి. ఈ అంశంపై చంద్రబాబునాయుడు వద్ద పంచాయితీ కూడ సాగింది. రోడ్ల విస్తరణ అంశం ఇద్దరు నేతల మధ్య అగ్గిరాజేసింది. ఇప్పటికీ ఈ పరిస్థితి ఇలానే ఉంది. 2019 నాటికి కూడ ఇదే వాతావరణం కూడ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందని టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తమౌతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టిడిపికి ఎదురుదెబ్బ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది.అయితే అదే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రజల అభిప్రాయాలుగా పరిగణించాల్సిన అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నివురు గప్పినా నిప్పులా పార్టీ నేతల మధ్య అసమ్మతి
పార్టీ నాయకుల మధ్య అసమ్మతి నివురుగప్పినా నిప్పులా ఉంది.పార్టీ నాయకుల మద్య వర్గపోరు. క్షేత్రస్థాయికి కూడ పాకింది. వీటిని పరిష్కరించకపోతే పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే వరదాపురం సూరి, పరిటాల సునీత వర్గాల మధ్య గొడవ విషయంలో బాబు ఇద్దరు నేతలకు క్లాస్ తీసుకొన్నారు.
స్వపక్షంలోనే విపక్షమే టిడిపికి దెబ్బ
అధికారంలో ఉన్న టిడిపికి స్వపక్షంలోనే విపక్షాన్ని గమనించకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీని నమ్ముకొన్న వారిని వదిలేసి పార్టీ పట్టించుకోవడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.పార్టీని కంటికి రెప్పలా కాపాడుకొన్నవారికి పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయాలున్నాయి. దీన్ని సరిదిద్దుకోకపోతే పార్టీకి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.