విభేదాలు: మీడియాపై గంటా అసహనం, హిందూపురంకు బాలకృష్ణ 'కొత్త' పేరు
విశాఖ: ఏపీలోని విశాఖ ఎమ్మెల్యేలు తన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వాదనల పైన మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం నాడు స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి.
దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేలకు చెప్పకుండా క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు జరగవన్నారు. ఇది కేవలం మీడియా సృష్టి అన్నారు. అంతేకానీ ఏ విధమైన అసంతృప్తి ఎమ్మెల్యేల్లో లేదని స్పష్టం చేశారు.
ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు వ్యక్తిగత విషయాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, కానీ వాటన్నింటినీ సమన్వయం చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయంలో మీడియా టీ కప్పులో తుఫాను సృష్టించిందని అసహనం తీవ్ర వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో అభివృద్ధి: బాలకృష్ణ
స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో అనంతపురం జిల్లా హిందూపురాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ వేరుగా అన్నారు. హిందూపురం పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
హిందూపురం సమీపంలోని గుడ్డం రంగనాథస్వామి దేవాలయంలో కోనేరు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్ మోహన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడారు. హిందూపురంను నందమూరిపురంగా అభివర్ణించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.