కేసీఆర్ లెక్క 350 కోట్లు, బాబు లెక్క వేలకోట్లు, ఉద్యోగుల కంటే ముందే.. భయపడ్డారు: వైసిపి
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రూ.350 కోట్లతో కొత్త సచివాలయం కడతానని చెబుతుంటే, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతి శంకుస్థాపనకే రూ.400 ఖర్చు చేశారని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
తాత్కాలిక నిర్మాణాలకే రూ.1800 కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు ఇష్టానుసారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో గెలిచాక.. పదేళ్ల పాటు హైదరాబాద్లో ఉండి పాలన చేస్తామని చంద్రబాబు ప్రకటించారన్నారు. కానీ ఓటుకు నోటు కేసుకు భయపడి ఉద్యోగుల కంటే ముందుగానే విజయవాడ వెళ్లిపోయారన్నారు. ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు.
రాజధాని నిర్మాణం పరుగులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను నవంబర్ ఒకటో తేదీ నుంచి పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నెల 28వ తేదీన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేస్తున్నందున నిర్మాణ పనులు జాప్యం లేకుండా కొనసాగాలన్నారు.
టార్గెట్ 2018 అనే నినాదంతో పరిపాలన నగరం, ఇతర మౌలిక సదుపాయాల పనులను ఆరంభించి వేగంగా పూర్తి చేయాలన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రకాశం బ్యారేజీ ఇవతలి ఇంద్రకీలాద్రి కొండపై దుర్గమ్మ కొలువై ఉన్నందున, అవతలి వైపు ఉన్న సీతానగరం కొండపై భారీ బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు.
అమరావతిలో ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరియాలని, టీటీడీ వెంకటేశ్వర ఆలయం, ఇస్కాన్ కృష్ణుడి మందిరంతో పాటు మసీదు, చర్చిల నిర్మాణం చేపట్టాలన్నారు. అమరావతిలో పది ఎకరాల విస్తీర్ణంలో హస్తకళల గ్రామం ఏర్పాటుకు కొంతమంది మహిళలు ముందుకొచ్చారన్నారు. రాజధానిలో నిర్మించే భవనాలు, కట్టడాలకు ఏకరూపత ఉండాలని, వాటి నిర్మాణ శైలి, ఆకృతుల్లో ఏపీ కళలు, బౌద్ధ సంస్కృతులు ప్రతిబింబించాలన్నారు.