ఇది నాల్గోసారి: గతంలోను ఇంతే వేగంతో!, మూడుసార్లు బుక్కైన నారాయణ కొడుకు
మంత్రి నారాయణ తనయుడు నిషిత్ దుర్మరణంతో మరోసారి రోడ్డు ప్రమాదాల గురించిన చర్చ మొదలైంది. ముఖ్యంగా యువత మితి మీరిన వేగమే వారి ప్రాణాలను గాల్లో కలిపేస్తుందని, నిషిత్ దుర్మరణంతో ఇది మరోసారి రుజువైందని పలువ
హైదరాబాద్: మంత్రి నారాయణ తనయుడు నిషిత్ దుర్మరణంతో మరోసారి రోడ్డు ప్రమాదాల గురించిన చర్చ మొదలైంది. ముఖ్యంగా యువత మితి మీరిన వేగమే వారి ప్రాణాలను గాల్లో కలిపేస్తుందని, నిషిత్ దుర్మరణంతో ఇది మరోసారి రుజువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మెట్రో పిల్లర్ను ఢీకొన్న బెంజ్ కారు: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మృతి
బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లో ప్రమాదానికి గురైన నిషిత్ కారు.. ఆ సమయంలో అతివేగంతో ప్రయాణించడం వల్లే ప్రమాదానికి గురైందని డీసీపీ సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నిషిత్ కారును అతివేగంతో నడపడం ఇదే తొలిసారి కాదని, ఇంతకుముందు కూడా పలుమార్లు ఇదే తరహాలో కారు నడిపి ట్రాఫిక్ జరిమానా చెల్లించాడని తెలుస్తోంది.
ఈ ఒక్క ఏడాదే:
ఈ ఒక్క ఏడాదిలోనే అతివేగంతో కారు నడిపినందుకు గాను మూడుసార్లు నిషిత్ ట్రాఫిక్ జరిమానా చెల్లించాడు. తొలిసారి జనవరి 24, 2017న గండిపేట వద్ద 150కి.మీ వేగంతో కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కాడు.
మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై:
మరోసారి మార్చి1న గండిపేట వద్దే అతివేగంతో కారు నడుపుతూ నిషిత్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఇక మార్చి 10న మూడోసారి ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కి జరిమానా చెల్లించాడు.
మెట్రో పిల్లర్ను ఢీకొట్టి:
బుధవారం తెల్లవారుజామున 2.45గం. ప్రాంతంలో నిషిత్ ప్రయాణిస్తున్న కారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లొని మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారు 120కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా చెబుతున్నారు. నిషిత్ తో పాటు అతని స్నేహితుడు రాజా రవి వర్మ కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
ప్రముఖుల పరామర్శలు:
నిషిత్ మరణ వార్త వినగానే పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు తొలుత అపోలో ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజ్య సభ సభ్యుడు చిరంజీవి, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నిషిత్ కుటుంబాన్ని పరామర్శించారు.