'కెసిఆర్తో కలుస్తానని జగన్ ముందే చెప్పలేదే, భూమాకు సొంత పార్టీ నేతల నుండే ముప్పు'
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందే కెసిఆర్తో కలుస్తానని జగన్ ఎందుకు చెప్పలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శనివారం నిలదీశారు. తానెవరితో కలిస్తే ఏంటంటూ నిలదీస్తోన్న జగన్ ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ.. తాను తెరాసతో జతకడతానంటూ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదన్నారు.
రాష్ట్ర విభజనతో టీడీపీకి ఎలాంటి ప్రమేయమూ లేదని, కాని రాష్ట్ర విభజన సమయంలో కేసులకు భయపడి కాంగ్రె్సతోనూ, హైదరాబాద్లోని ఆస్తులను కాపాడుకోవడానికి లోపాయికారిగా కేసీఆర్తోనూ జగన్ కుమ్మక్కయ్యారన్నారు.
తెలంగాణలో వైపీసీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిస్తే, ఇద్దర్ని టీఆర్ఎస్లోకి పంపించి, మూడో ఎమ్మెల్యేను తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రం సుఖసంతోషాలతో విరాజిల్లాలని నాయకుడు కోరుకుంటారని కానీ, జగన్ మాత్రం తాను కాలు బయటకు పెట్టేందుకు చావులు కోరుకుంటాడన్నారు.
తెలుగు ప్రజలకు రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదని కాని, ఎన్టీఆర్ను చూస్తే మాత్రం రాముడు, కృష్ణుడు గుర్తుకు వస్తారని, అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని పుష్కరఘాట్ వద్ద పెడితే తప్పేంటన్నారు. లక్ష కోట్లు తిన్న వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు రోడ్డుకు అడ్డంగా ఉంటూ ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్నాయని దానిపై మాట్లాడాలన్నారు.
కెసిఆర్ కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. రాష్ట్రపతి వ్యాఖ్యలు దీనికి నిదర్శనమన్నారు. టీడీపీ ఆంధ్ర పార్టీ కాదని, తెలుగువారి పార్టీ అన్నారు. టీఆర్ఎస్లో అరవై శాతం మంది టీడీపీ నుంచి వెళ్లిన వారే అన్నారు.
భూమా నాగిరెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే ముప్పు ఉందన్నారు. ఆయన జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెరో 15 రోజులు ఉంటానని చెప్పడం శుభపరిణామమని చెప్పారు.