రిషికేశ్వరి ఆత్మహత్య: ఇలా విచారిస్తారు, మెయిల్ ద్వారా కూడా
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి మృతి పైన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ చేపడుతోంది. ఈ విచారణ కమిటీలో ఎస్పీఎస్ నెల్లూరు విక్రమసింహ వర్సిటీ వీసీ వీరయ్య, వెంకటేశ్వర వర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణమ నాయుడు, పద్మావతి వర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మిలు పాల్గొన్నారు.
ఈ సంఘం బుధవారం నాడు రెవెన్యూ, పోలీసు, విశ్వవిద్యాలయ అధికారులతో చర్చిస్తుంది. గురువారం నాడు విద్యార్థులతో బహిరంగ విచారణ చేపడుతుంది. మూడో రోజు శుక్రవరం నాడు మళ్లీ అధికారులతో సమావేశం కానుంది.
రిషికేశ్వరి మృతికి దారి తీసిన కారణాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన నివేదిక అందించనుంది. మెయిల్ ద్వారా కూడా సమాచారం సేకరించనున్నారు. కాగా, నేటి విచారణకు మీడియాను అనుమతించడం లేదు.
మరోవైపు, నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య సంఘటనపై విచారణ జరిపేందుకు వర్సిటీ పరిధిలో ఏర్పాటైన నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికను వైస్ చాన్సలర్ కెఆర్ఎస్ సాంబశివ రావుకు అందజేసింది.
కమిటీ కన్వీనర్ రాంబాబు ఆ నివేదికను మంగళవారం విసికి అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్కు బలైన విషయం తెలిసిందే. నిజనిర్ధారణ కమిటీ అందించిన రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తామని వైస్ చాన్సలర్ తెలిపారు. ప్రభుత్వం నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.