టిక్కెట్ కోసం మైనంపల్లి మూడ్రోజుల్లో 3 పార్టీలు మారారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున మల్కాజిగిరి అసెంబ్లీ సీటును దక్కించుకున్న మైనంపల్లి హన్మంత రావు దాదాపు మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే టిక్కెట్ కోసం మూడు పార్టీలు మారారు. ఆయన మొదట టిడిపి నాయకుడు. మల్కాజిగిరి టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్నారు.
పొత్తులో భాగంగా మల్కాజిగిరి స్థానం బిజెపికి వెళ్లింది. దీంతో మైనంపల్లి అలకవహించారు. తనకు మల్కాజిగిరి కేటాయించాల్సిందేనని చంద్రబాబుతో పట్టుబట్టారు. కుదరక పోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ నుండి మల్కాజిగిరి టిక్కెట్ వస్తుందని భావించి.. అందులో చేరారు.
కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి టిక్కెట్ను మరో అభ్యర్థికి కేటాయించింది. దీంతో అతను తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూశారు. తెరాస ఆయనకు మల్కాజిగిరి స్థానాన్ని కేటాయించేందుకు అంగీకరించింది. దీంతో ఆయన తెరాసలో చేరి.. వెంటనే టిక్కెట్ అందుకున్నారు.
తెరాసలో చేరకముందు కాంగ్రెసు పార్టీలో టిక్కెట్ వస్తుందని మైనంపల్లి భావించినప్పటికీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మరొకరికి ఇచ్చేవిధంగా లాబీయింగ్ చేశారట. దీంతో మైనంపల్లికి రాలేదు. మల్కాజిగిరి టిక్కెట్ కోసమే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తెరాసలో చేరారు. టిక్కెట్ రాదని తేలడంతో తిరిగి కాంగ్రెసులోకి వచ్చారు.