మోడీ 'గోల్డ్ స్కీం'లో శ్రీ వెంకటేశ్వర స్వామి: అతిపెద్ద డిపాజిటర్?
చిత్తూరు/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించజిన గోల్డ్ మోనిటైజేషన్ పథకానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అతిపెద్ద డిపాజిటర్ కానున్నారా? అంటే అవుననే అంటున్నారు. ప్రధాని మోడీ ఇటీవల ప్రకటించిన ఈ పథకానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు.
పథకం తీరుతెన్నులను తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు ఫోన్లు చేశారు. కానీ తమ ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీసేందుకు మాత్రం ముందుకు రాలేదు. ప్రధాని మోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ పథకానికి ఇప్పటిదాకా కేవలం 400 గ్రాములబంగారం మాత్రమే చేరింది.
ప్రధాని మోడీ ప్రకటించిన ఈ పథకం ద్వారా దాదాపు 20,000 టన్నుల బంగారం బయటకు వస్తుందని ఆశించారు.
అయితే, భక్తులు ఇచ్చే కానుకల విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న తిరుమల శ్రీవారు సన్నిధి మాత్రం తన బంగారాన్నంతా ప్రధాని మోడీ గోల్డ్ స్కీంలో డిపాజిట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. భక్తుల నుంచి శ్రీవారికి అందిన బంగారాన్ని కరిగించి వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది టిటిడి.
ఇప్పుడు ఆ బంగారాన్ని ప్రధాని మోడీ ప్రకటించిన బంగారం స్కీంలో పెట్టేందుకు సిద్ధపడుతోంది. ఈ మేరకు ఇన్వెస్ట్మెంట్ ప్యానెల్ నుంచి అనుమతి రాగానే బంగారాన్ని ప్రధాని గోల్డ్ స్కీంలో పెట్టుబడి పెట్టనున్నట్లు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చెబుతోంది.
ఇది రూపుదాల్చితే ప్రధానీ మోడీ గోల్డ్ స్కీంలో శ్రీవారు అతిపెద్ద డిపాజిటర్గా రికార్డులకెక్కుతాడు. ఈ గోల్డ్ స్కీం ద్వారా.. ఎవరైతే ఈ గోల్డ్ స్కీంలో చేరుతారో వారికి 2.50 పర్సెంట్ వడ్డీ వస్తుంది.