'ఆది! నువ్వెంత.. నీ చదువెంత?, ఎందుకంత కావరం.. దిగజారితే సహించం'
నువ్వెంత?.. నీ చదువెంత?.. నీకెందుకంత కావరం.. అంబేడ్కర్ కు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో నీకు తెలుసా?' అంటూ ప్రశ్నించారు.
నంద్యాల: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆది నారాయణరెడ్డి అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల నుంచి ఆదికి గట్టి కౌంటర్ ఎదురవుతోంది. బుధవారం ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ ఆది నారాయణరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి దళితులపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వరప్రసాద్ ఆదికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. అంతేకాదు, దళితులకు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'నువ్వెంత?.. నీ చదువెంత?.. నీకెందుకంత కావరం.. అంబేడ్కర్ కు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో నీకు తెలుసా?' అంటూ ప్రశ్నించారు.
దళితుల్లో ఉన్నత చదువులు చదివినవారు వేల మంది ఉన్నారని, ఇప్పటికైనా అగ్ర కుల దురహంకారాన్ని తగ్గించుకోవాలని వరప్రసాద్ అన్నారు. దళితుల శుభ్రత గురించి ఆది నారాయణరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని మరో నేత మేరుగ నాగార్జున మండిపడ్డారు.
మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అన్నారు. చంద్రబాబు బాటలోనే ఆది నారాయణ రెడ్డి కూడా వెళ్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే.. ఎస్సీలు చదువుకోరు, వారు శుభ్రంగా ఉండరంటూ ఆదినారాయణ మాట్లాడటం దారుణమన్నారు. ఆదినారాయణ రెడ్డిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లవుతున్నా దళితులు మారలేదని, వారికి కల్పించిన రిజర్వేషన్లు ఏడు పదులు దాటి ఎనిమిది పదుల్లోకి వెళ్తున్నా వారిలో మార్పు రాలేదని ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.వారు చదువుకోరని, శుభ్రంగా ఉండరని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
అంతేకాదు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయారని, బీసీ సంఘం నేత కృష్ణయ్యకు సీటిస్తే..మెజారిటీ తగ్గిందని ఆయా వర్గాల నేతలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.