జైలా? బెయిలా?: జగన్ భవితవ్యం తేలేది నేడే
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై శుక్రవారం సీబీఐ కోర్టు విచారించనుంది. బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టు వేసిన పిటీషన్పై నేడు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణుల్లో, ఇటు జగన్ కుటుంబంలోనూ ఆందోళన నెలకొని ఉంది.
సాక్షి ఛానల్లో ప్రసారమైన మాజీ సీఎస్ ఇంటర్వ్యూ.. సాక్షులను ప్రభావితం చేసేదిగా ఉందని సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరింది.
కాగా, సీబీఐ వాదనను జగన్ తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. ఆ ఛానల్కు జగన్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్.. రమాకాంత్ రెడ్డితో మాట్లాడలేదని తెలిపారు. సీబీఐ అభ్యర్థనను కొట్టివేయాలని ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు విన్నవించారు.
ఇది ఇలా ఉండగా, జగన్ పై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కాగా, జగన్ బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో జగన్ కుటుంబసభ్యుల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన నెలకొనివుంది.
కోర్టుకు జగన్: ఆస్తుల కేసు వాయిదా
కాగా, ఆస్తుల కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర నిందితులు శుక్రవారం ఉదయం కోర్టులో హాజరయ్యారు. కాగా, జగన్ ఆస్తుల కేసు విచారణను కోర్టు.. జూన్ 9కి వాయిదా వేసింది.