‘తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే కఠిన చర్యలు’
తిరుపతి: తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఏఎస్పి స్వామి హెచ్చరించారు. మంగళవారం తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన పాస్టర్ సుధీర్కు చెందిన ల్యాప్టాప్ తోపాటు సిస్టమ్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఇటీవల పాస్టర్ సుధీర్ తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన వీడియో పలు మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతి పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చగా సుధీర్కు కోర్టు రిమాండ్ విధించింది.
అన్యమత ఉద్యోగులను తొలగించేందుకు టిటిడి కసరత్తు
తిరుమల దేవస్థానంలో అన్యమత ఉద్యోగులను సాగనంపే ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రారంభించారు. ఎస్పిఎఫ్లో 70మంది హైందవేతరులు ఉన్నట్లు గుర్తించినట్లు టిటిడి అధికారులు చెప్పారు. ఇకపై హిందువులను మాత్రమే భద్రతా విధులకు పంపాలని ఎస్పిఎఫ్ అధికారులకు టిటిడి అధికారులు సూచించారు.
గత కొంత కాలంగా తిరుమల దేవస్థానం పరిసరాల్లో అన్యమత ప్రచారం జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన టిటిడి, అందుకు తగిన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే అన్యమత ఉద్యోగులు టిటిడిలో లేకుండా చూడాలని భావిస్తోంది. హిందూ మతానికి చెందిన వారినే ఉద్యోగులుగా నియమించాలని టిటిడి నిర్ణయించింది.