విషాదం మిగిలింది : సూర్యలంక బీచ్లో.. బీటెక్ విద్యార్థి గల్లంతు, మరొకరు మృతి
బాపట్ల : సరదాగా సముద్ర తీరానికి వెళ్లిన బిటెక్ విద్యార్థినులు విషాదమై వార్తల్లోకి ఎక్కారు. బాపట్లలోని వడ్లమూడి విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతోన్న విద్యార్థినులు ప్రత్యూష, సుష్మప్రియ, శ్రావ్య, సత్య సముద్ర తీరంలో స్నానం చేసేందుకు సూర్యలంక బీచ్ కు వెళ్లారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సముద్ర అలల్లో వీరంతా కొట్టుకుపోయినట్లు సమాచారం. విద్యార్థినులు నీట మునిగిన విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు, మెరైన్ పోలీసులు వారి కోసం ముమ్మరంగా గాలించారు. గాలింపు చర్యల్లో భాగంగా.. ప్రత్యూష, సుష్మాప్రియ, శ్రావ్య అనే ముగ్గురు విద్యార్థినులను ఒడ్డుకు చేర్చారు.
అనంతరం ప్రభుత్వ అంబులెన్స్ కోసం 108కు ఫొన్ చేసి విద్యార్థినులను ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే ప్రత్యూష అనే విద్యార్థిని మృతి చెందింది. ప్రస్తుతం సుష్మప్రియ, శ్రావ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. గల్లంతయిన సత్య కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.