మావోలపై ఎదురు తిరిగిన అడవి బిడ్డలు (పిక్చర్స్)
విశాఖ: మావోయిస్టులకు కంచుకోటగా పేరుపొందిన విశాఖ జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ అటవీప్రాంతంలో తొలిసారిగా మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. భక్తి ముసుగులో పోలీస్ ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడన్న నెపంతో వీరవరం గ్రామానికి చెందిన సంజీవ రావు అనే గిరిజనుడిని ఆదివారం సాయంత్రం కోరుకొండ సమీపంలో మావోయిస్టులు కాల్చి చంపారు.
దీంతో కోపోద్రిక్తులైన మూడు గ్రామాల గిరిజనులు మావోయిస్టుల పైన మెరుపుదాడి చేసి ఒక మావోయిస్టును, ఇద్దరు మిలీషియా సభ్యులను హతమార్చారు. ఈ సంఘటన మన్యంలో సంచలనం రేపింది. ప్రతి ఆదివారం కోరుకొండలో జరిగే వారపు సకంతకు వీరవరం గ్రామానికి చెందిన సంజీవ రావు వెళ్లాడు.
సంత ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న అతనిని మావోయిస్టులు పట్టుకొని కాల్చి చంపారు. అయితే, అతను మావోలను నిలదీయడంతో కాల్చి చంపారనే వాదనలు కూడా వినిపించాయి.
సంజీవ రావు ఆధ్యాత్మిక గురువు సింహాచలాన్ని కూడా మావోయిస్టులు చేతులు కట్టి కోరుకొండకు తీసుకు వస్తుండగా విషయం తెలుసుకున్న వీరవరం తూరుమామిడి, దిగవలసపల్లి గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన గిరిజనులు అంతా ేకమై మావోయిస్టులను చుట్టుముట్టారు.
ముందుగా మావోయిస్టు శరత్ వద్ద ఉన్న ఏకే 47 తుపాకీని లాక్కున్నారు. అదే ఆయుధంతో పాటు రాళ్లతో అతడి తల పైన బలంగా కొట్టారు. దీంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. గిరిజనులు అక్కడే ఉన్న మావోయిస్టు మిలీషియా సభ్యుడు కొర్రా నాగేశ్వర రావు, సబ్బంపల్లి గ్రామానికి చెందిన మిలీషియా సభ్యుడు గణపతిలను కొట్టారు.
దీంతో గణపతి అక్కడికి అక్కడే మృతి చెందాడు. నాగేశ్వర రావును బండరాళ్లతో బలంగా కొట్టి వాగులో పడేశారు. శరత్, సంజీవ రావు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గణపతి మృతదేహాన్ని అతని బంధువులు తీసుకెళ్లారు. కాగా, ఆదివారం నాటి ఘటనతో కోరుకొండ ప్రాంతంలో వాతావరణం భయానకంగా ఉంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇలాంటి ప్రాంతంలో పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు గిరిజనుల పైన దాడికి పాల్పడటాన్ని గిరిజనులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.