టిఆర్ఎస్ ఐదో అభ్యర్థి: జానాకు సవాల్, మండుతున్న ఉత్తమ్
హైదరాబాద్: ఎండాకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో అభ్యర్థిని రంగంలోకి దింపి రాజకీయ వాతావరణాన్ని కూడా వేడెక్కించారు. ఐదో అభ్యర్థి వల్ల కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో దేనికి ముప్పు వచ్చిపడుతుందో తెలియని అయోమయ స్థితి నెలకొంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చెరో అభ్యర్తిని రంగంలోకి దింపాయి. పార్టీ శాసనసభా పక్ష నేతగా ఈ ఎన్నికలు కాంగ్రెసు సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి సవాల్ విసురుతున్నాయి. కాగా, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కెసిఆర్పై నిప్పులు కురిపిస్తున్నారు.
కాంగ్రెసుకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బయటకు వెళ్లారు. దీనికి తోడు, పార్టీ అభ్యర్థిగా ఆకుల లలిత ఎంపికపై కొందరు పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో జానారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ ఎమ్మెల్యేలందరితోనూ స్వయంగా మాట్లాడారు.
గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న సిపిఐ మద్దతు కోసం జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రయత్నించారు. రెండు రోజుల్లో జరిగే పార్టీ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలుపొందాలంటే (మొత్తం సభ్యులు ఓటింగులో పాల్గొంటే) 18 ఓట్లు సరిపోతాయని, ఆ మేరకు కాంగ్రెస్కు బలముందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈ స్థితిలో పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అగ్రనేతలు జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 26న జరిగే సీఎల్పీ సమావేశంలో చర్చించనున్నారు. గురువారం నాటి భేటీలోనూ పలు అంశాలపై నేతలు చర్చించారు. అధికార టీఆర్ఎస్ ఐదుగురిని రంగంలోకి దించినా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు పూర్తయ్యేదాకా వేచి చూడాలని భావిస్తున్నారు. ఈ నెల 25న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. దాంతో మర్నాడు ఈ నెల 26నన సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారు.
నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకోవడానికే బలం లేకున్నా అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీఆర్ఎస్ బరితెగించి ఐదుగురిని బరిలో దింపిందని ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. అధికార టీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేయాలని చూస్తోందని, అక్రమమార్గాల ద్వారా ఐదో స్థానాన్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఓట్లు బహిరంగంగా వేయాలని, పార్టీ విప్ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు.