విజన్ లేదు: కెసిఆర్పై దుమ్మెత్తిపోసిన లోకేష్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్కు విజన్ లేదని ఆయన అన్నారు. కెసిఆర్ హైదరాబాద్ విడిచి బయటకు వెళ్లరని, అలా రైతులు కెసిఆర్ను తరిమికొడుతారని ఆయన శుక్రవారంనాడు అన్నారు.
2019లో తెరాస తుడిచిపెట్టుకుపోతుందని, ద్వేషాన్ని పెంచి పోషించే పార్టీకి భవిష్యత్తు ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కెసిఆర్ను విమర్శించే హక్కు తనకు ఉందని, కెసిఆర్ ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారని లోకేష్ అన్నారు. పార్టీ కార్యాలయాలను తెరాస నాయకులు దగ్ధం చేస్తున్నారని, అలా దగ్ధం చేస్తామని ఎస్ఎంఎస్ మెసేజ్లు పెడుతున్నారని ఆయన చెప్పారు
మరో ప్రాంతంపై ద్వేషాన్ని పెంచే ఎవరూ కూడా ముందుకు సాగలేరని అంటూ ఉత్తర కొరియా ఉదంతాన్ని ఆయన ఉటంకించారు. ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై ద్వేషాన్ని నూరిపోసిందని, అయితే దక్షిణ కొరియా అలా చేయలేదని, ప్రగతి గురించి మాత్రమే మాట్లాడిందని ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికే నిర్మాణమై ఉన్న హైదరాబాద్ నగరంలో అభివృద్ధి మందగించిందని లోకేష్ అన్నారు. హైదరాబాద్ను తన నాయకుడు చంద్రబాబు నాయుడు నిర్మించి, ఈ స్థితిలోకి తెచ్చారని ఆయన అన్నారు. హైటెక్ సిటీ నిర్మాణాన్నికి 18 నెలల కాలం పట్టిందని, అది కూడా ఇప్పుడు ముందుకు సాగడం లేదని అన్నారు.
తమ హెరిటేజ్ కంపెనీ సిద్ధిపేట సమీపంలోని ములుగు వద్ద సోలార్ ప్రాంట్ కోసం ప్లాన్ చేశామని, తాము పెట్టిన 18 -20 కోట్ల పెట్టుబడి వృధా అయిందని అన్నారు. విధానం మారడంతో ఆ ప్లాంట్ లాభిసాటి కాకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తెరాస విద్యుత్తు కోసం అంగలారుస్తోందని అన్నారు.
పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండాలని, లేకుంటే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని, ఆంధ్రలో ఐటి చోదకశక్తి కాదని, ఓడరేవులు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఏ విషయం మీద కూడా కెసిఆర్ తమ నాయకులతో చర్చకు ముందుకు రాలేదని ఆయన అన్నారు. తాను వైయస్ జగన్ను విమర్శించినట్లుగానే కెసిఆర్ను కూడా విమర్సిస్తానని నారా లోకేష్ చెప్పారు.