ఉనికిని చాటేందుకే బస్సు యాత్ర: తెలంగాణ మంత్రి
హైదరాబాద్: తెలంగాణ రాష్టంలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికే బస్సుయాత్ర చేస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారని అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణ ఎమ్మెల్యేలను మభ్యపెడుతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, తెదేపా, వైకాపాలను ప్రజలు నమ్మే పరిస్దితిలో లేరన్నారు. తెరాస పార్టీని విమర్శిస్తే తగిన విధంగా తిప్పి కొడతామని ఆయన హెచ్చరించారు.
ఐతే తెలంగాణ తెలుగు దేశం పార్టీ మాత్రం ఎండుతున్న పంటలను చూసి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలకు ఆత్మైస్థెర్యాన్ని కల్పించేందుకే బస్సు యాత్ర చేపట్టామని టీ టీడీపీ కన్వీనర్ ఎల్.రమణ, శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు.
శనివారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డ్ను సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడనున్నట్లు తెలిపారు. తెలంగాణలో కరెంటు కోతలతో రైతులు అప్పులు చేసి జనరేటర్లను కొనుగోలు చేసి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇంత చేసినా పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించడంలో ప్రభుత్వం ముందు చూపులేకుండా వ్యవహరిస్తోందన్నారు.
రైతులకు మనోధైర్యం కల్పించాలనే బస్సు యాత్ర చేపట్టామని ఇందులో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు. రేపు మధ్యాహ్నం 12గంటలకు కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాకు టీడీపీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నల్ల మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు గోపినాథ్, సండ్ర వెంకటవీరయ్య, రాజేందర్రెడ్డి, గాంధీ, ప్రకాశ్గౌడ్, రేవంత్రెడ్డి, కృష్ణారావు తదితరులతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు.
తెదేపా బస్సు యాత్రలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు దళితుడుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రజల్ని కె. చంద్రశేఖరరావు మోసగించాడాని ఆయన విమర్శించారు. అయితే తెలంగాణకు ఓ దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంత్రులను టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్లవద్ద కాపలా పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించాడు. టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకు రాకపోతే మంత్రి పదవుల నుంచి తప్పిస్తానని కె. చంద్రశేఖరరావు బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు.