నీ మౌనం ఏపీకి శాపం.. మోడీని నిలదీయ్, మేం ఇలాగే బాధపడ్డాం: సూసైడ్లపై కవిత
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీలో ఆత్మహత్యలు బాధాకరమని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తెచ్చి సాధించాలని టిఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం సూచించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తరఫున కల్వకుంట్ల కవిత ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ బలిదానాలు సాగుతోండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. చంద్రబాబు ఇకనైనా మౌనం వీడాలని హితవు పలికారు.
చంద్రబాబు మౌనం ఏపీ ప్రజలకు శాపంలా పరిణమించిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఇప్పటికైనా ప్రధాని మోడీని చంద్రబాబు గట్టిగా నిలదీయాలన్నారు. ఏపీలో పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోను తాము ఇలాంటి ఇబ్బందులను, బాధాకర పరిస్థితినే ఎదుర్కొన్నామని చెప్పారు. కేంద్రం సాయం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను అన్నదమ్ముల్లా మెలిగి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కృషి చేయాలన్నారు.
తెలంగాణకు అన్యాయం చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్న విషయాన్ని తాము కేంద్రానికి వివరించామని కవిత చెప్పారు.