కొత్త కళ: మురిసిన కవిత, కెమెరా క్లిక్మనిపించారు, నేపాల్ భూకంపంపై కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభకు జనం భారీగా తరలి వచ్చారు. పరేడ్ మైదానం కిక్కిరిసిన ఉండటంతో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సభకు వచ్చిన జనాన్ని క్లిక్ మనిపించారు. పరేడ్ మైదానంలో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. భారీగా తరలి వచ్చిన జనాన్ని చూసి కవిత మురిసిపోయారు. ఆమె తన స్మార్ట్ ఫోన్లో జనాన్ని క్లిక్ మనిపించారు.
పరెడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన తెరాస 14వ ఆవిర్భావ సభ వద్దకు ఆ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరున్నర గంటల ప్రాంతంలో చేరుకున్నారు. తెలంగాణ కోసం అసువులు బాసిన అమర వీరులకు ఆయన నివాళులర్పించారు. కేసీఆర్ సభా వేదిక పైకి రాగానే మంత్రులు, కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.
అంతకుముందు కంటెన్మెంట్ నుండి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భారీ ర్యాలీగా బహిరంగ సభకు వచ్చారు. తెరాస బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ గులాబీ మయమైంది.య కనీవినీ ఎరగని రీతిలో జనం తరలి వచ్చారు. ధూంధాంతో సభ మార్మోగింది. రసమయి బాలకిషన్ తన కళా బృందంతో ఆడుతూ పాడుతూ ధూంధాం చేశారు.
కాగా, నాడు ఉద్యమ పార్టీగా మొదలైన తెరాస, ఇప్పుడు తెలంగాణ కళ సాకారం అయిన తర్వాత కొత్త రాష్ట్రంలో అధికారం కూడా చేపట్టింది. దీంతో పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా ఆవిర్భావ సభ ఏర్పాట్లలో పాల్గొంటున్నారు.
సభకు 10 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేశారు. నగరంలో 100 చోట్ల వాహనాల పార్కింగ్ వసతి కల్పించారు. వేదిక నిర్మాణంతోపాటు, సభ పూర్తయ్యే సమయానికి చీకటి పడనున్న దృష్ట్యా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
కాగా, నేపాల్ భారీ భూకంపం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తెలంగాణ తరఫున తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. తెరాస ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగుతోందన్నారు.