తిరుమల భక్తులకు శుభవార్త: త్వరలో 100 గ్రాముల లడ్డూ ఉచితం
తిరుమల: త్వరలో ప్రతి భక్తునికి 100 గ్రాముల లడ్డూను ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) తెలిపింది. సోమవారం నిర్వహించి టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయం వద్ద రూ. 4 కోట్లతో విశ్రాంతి భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. టీటీడీ అనుబంధ ఆలయాలను రూ. 6.25 కోట్లతో అభివృద్ధి చేస్తామని టీటీడీ తెలిపింది. దీంతో పాటు ఆరు నెలలకు సరిపడా 2.20 లక్షల కేజీల ఆవు నెయ్యి కొనుగోలుకు రూ. 46.92 కోట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
దీంతో పాటు రెండు లక్షల కేజీల ఎండు ద్రాక్ష కొనుగోలుకు రూ. 3.50 కోట్లు, ఆరు నెలల సరిపడా కందిపప్పు కొనుగోలుకు రూ. 4.13 కోట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అనధికార హాకర్లను ఏరివేయాలని నిర్ణయించింది.
సెప్టెంబర్లో జరిగే బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు, వెయ్యి కాళ్ల మండపం నిర్మాణానికి ప్లాన్ను పరిశీలిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. కాగా, 2016 ఏడాదికిగాను 15 లక్షల క్యాలెండర్లు, 7 లక్షల డైరీలు ముద్రించాలని టీటీడీ పాలక మండలిలో నిర్ణయాలు తీసుకుంది.