వాస్తు సలహాదారుడు: కెసిఆర్పై తుమ్మల అసంతృప్తి?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో మరో చిచ్చు చెలరేగే ప్రమాదం ఉంది. వాస్తు సలహాదారుడిని నియమించాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచన రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు మింగుడు పడడం లేదని అంటున్నారు. దీంతో ఆయన కెసిఆర్ ఆలోచనపై తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రధానమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టనున్న నేపథ్యంలో వాటిపై ఓ కన్నేసి ఉంచడానికి మాత్రమే రోడ్లు భవనాల శాఖలో వాస్తు సలహాదారుడిని నియమించాలని కెసిఆర్ భావిస్తున్నారనే అభిప్రాయంతో తుమ్మల ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తు సలహాదారుడి నియమాకం వల్ల కార్యక్రమాల అమలులో తుమ్మల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ఆయన మద్దతుదారులు అంటున్నట్లు వార్తలు వచ్చాయి.
అవినీతి ఆరోపణలపై రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖలో సలహాదారుడిని నియమించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. దాదాపు 25 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు ఈ శాఖ కింద చేపట్టనున్నారు. తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతోనే తుమ్మల నాగేశ్వర రావు కెసిఆర్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు.
వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజను కెసిఆర్ ప్రభుత్వ వాస్తు సలహాదారుడిగా నియమించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులు ఏడుగురు ఉన్నారు. సుధాకర్ తేజ మరో సలహాదారుడిగా నియామకం కానున్నారు. ప్రభుత్వ ఆర్కిటెక్చర్ సలహాదారుగా ఆయనను నియమించాలని కెసిఆర్ అనుకుంటున్నారు. అయితే, సుధాకర్ తేజకు ఇప్పటి వరకు ఏ విధమైన ఆదేశాలూ అందలేదు.
బంజారా భవన్, క్రైస్తవ భవన్, బ్రాహ్మణ భవన్ వంటి కమ్యూనిటీ భవనాలతో పాటు హైదరాబాద్ నలువైపులనూ కలుపుతూ రెండు స్కైవే కారిడార్లు పథక రచన దశలో ఉన్నాయి. వంద కిలోమీటర్ల పరిధిలో కొత్త రింగ్ రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాలు చేపట్టాలని కెసిఆర్ అనుకుంటున్నారు. ఈ స్థితిలో సుధాకర్ తేజను వాస్తు సలహాదారుగా నియమించాలని కెసిఆర్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
వాస్తుపై కెసిఆర్కు అపారమైన విశ్వాసం ఉంది. ఆయన వ్యక్తిగత వాస్తు విషయాలను ఇప్పటి వరకు సుధాకర్ తేజనే చూస్తున్నారు. కెసిఆర్కు ఆయన అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో సుధాకర్ తేజ నియామకం తనకు ఇబ్బంది కలిగిస్తుందనే అభిప్రాయంతో తుమ్మల నాగేశ్వర రావు ఉన్నట్లు చెబుతున్నారు.