అనురాధ దంపతుల హత్య: కటారి మోహన్పై చంద్రబాబుకు చింటూ ఫిర్యాదు?
చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ దంపతులకు, వారి మేనల్లుడు చింటూకు మధ్య తలెత్తిన విభేదాల గురించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ముందే తెలుసునని అంటున్నారు. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
చింటూ, కటారి మోహన్ మధ్య గొడవ తన దృష్టికి వచ్చి ఉంటే సమస్యను పరిష్కరించి ఇంతదూరం రాకుండా చూసేవాడినని కటారి దంపతుల హత్యానంతరం చంద్రబాబు మీడియాతో అన్నారు. అయితే, ఈ విభేదాల గురించి కటారి మోహన్తో పాటు చింటూ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ముందే చెప్పారంటూ ప్రచారం సాగుతోంది.
మోహన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చింటూ చంద్రబాబుకే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్కు ఫిర్యాదు చేశాడని చెబుతున్నారు. అయితే, చింటూ చీటికిమాటికి చిల్లర గొడవలకు దిగుతూ పార్టీకి కూడా ఇబ్బందులు సృష్టిస్తున్నాడని కటారి మోహన్ వారికి చెప్పాడని అంటున్నారు. అయితే, పరిస్థితి ఇంత దూరం వస్తుందని చంద్రబాబు గానీ లోకేష్ గానీ ఊహించకపోవచ్చు.
ఇదిలావుంటే, మేయర్ అనురాధ దంపతుల హత్య కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ పెద్దనాన్న గురప్పను పోలీసులు మంగళవారంనాడు విచారించారు. మోహన్ పెద్దక్క యశోదమ్మ భర్తే గురప్ప. 2005లో జరిగిన ఎన్నికల్లో యశోదమ్మ తన తమ్ముడు కటారి మోహన్పై పోటీ చేసి ఓడిపోయింది.
అప్పటి నుంచి కటారి, గుర్రప్ప కుటుంబాల మధ్య విభేదాలు పొడసూపినట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో చింటూకు, గురప్ప కుటుంబ సభ్యులకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. చింటూకు గురప్ప ఓ వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో అప్పు ఇప్పించినట్లు చెబుతున్నారు. అయితే, ఆ మొత్తం దేని కోసం చింటూ ఉపయోగించాడనేది తనకు తెలియదని గురప్ప పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.